విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి బెంజ్ సర్కిల్ నుండి ఆటోనగర్ మార్గంలో డ్రైనేజీ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు జాతీయ రహదారులు నేషనల్ హైవే అథారిటీ అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని కలెక్టరేట్లో ఎన్హెచ్ఎఐ, నగరపాలక సంస్థ, రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ఆయన ఛాంబర్లో జాతీయ రహదారి డ్రైనేజీ సమస్య పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి ఎన్హెచ్ 65లో బెంజ్ సర్కిల్ నుండి ఆటోనగర్ మార్గంలో సరైన డ్రైనేజీ లేకపోవడం వలన రెండు కిలోమీట్లం వరకు సుమారు 4 నుండి 5 ప్రాంతాలలో వర్షపు నీరు నిల్వ ఉండి వాహన దారులు, పాదచారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సజావుగా ఉండకపోవడంతో నగరంలో భారీ వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీరు జాతీయ రహదారిపై నిల్వ ఉండి నగరం గుండా పోయే వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్న సందర్భాలు అనేకం జరిగాయన్నారు. శాశ్వత పరిష్కారం దిశగా నగరపాలక సంస్థ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో నేషనల్ హైవే అథారిటీ అధికారులు త్వరతగతిన పనులు చేపట్టి పరిష్కరించాలన్నారు. రానున్న వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకుని యుద్దప్రాతిపదికన ఏ ఒక్కరికి నష్టం కలగకుండా నిబంధనల మేరకు పనులను పూర్తి చేయాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. పి. సంపత్ కుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎన్హెచ్ఎఐ ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణ రెడ్డి, విజయవాడ ఆర్డివో సిహెచ్ భవాని శంకర్, నగరపాలక సంస్థ ఇఇ చంద్రశేఖర్, సిటీప్లానర్ జూబిన్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
![](https://prajavartha.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-22-at-1.53.45-PM-660x330.jpeg)