– హైరిస్క్ ప్రెగ్నెన్సీ చికిత్సలు, పునరుత్పత్తి ఔషధ విభాగాల్లో విప్లవాత్మక ఆవిష్కరణలు
– పెరినటాలజీ, రీప్రొడక్టివ్ మెడిసిన్ సీఎంఈలో వక్తలు
– ఐఎంఏ, వీవోజీఎస్ సౌజన్యంతో అను మై బేబీ వైద్య సదస్సు
– రెండు రోజుల సదస్సులో వివిధ అంశాలపై నిపుణుల ప్రసంగాలు
– పలు అంశాలపై వర్క్ షాపుల నిర్వహణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ గాజుల రమేష్ అన్నారు. పెరినటాలజీ, రీప్రొడక్టివ్ మెడిసిన్ సీఎంఈ ద్వారా, ఆయా విభాగాలకు సంబంధించిన ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చక్కటి అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, విజయవాడ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ సౌజన్యంతో అను మై బేబీ వైద్య సదస్సు ముగింపు కార్యక్రమం నగరంలోని హోటల్ మురళీ ఫార్చ్యూన్ లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ ప్రసంగిస్తూ.. అత్యంత క్లిష్టమైన ప్రసూతి కేసులు, పునరుత్పత్తి ఔషధ విభాగంలో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు వెలుగు చూశాయన్నారు. నూతన ఆవిష్కరణల సహాయంతో మెరుగైన ఫలితాలను సాధించవచ్చని తెలిపారు. ఆధునిక ఔషధాల వినియోగం ద్వారా పునరుత్పత్తికి సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని వెల్లడించారు. అత్యంత క్లిష్టమైన ప్రసూతి కేసులు, పునరుత్పత్తి ఔషధాలకు సంబంధించి వివిధ అంశాలపై ఈ సీఎంఈలో విస్తృతంగా చర్చించినట్లు డాక్టర్ గాజుల రమేష్ తెలిపారు. రెండు రోజుల సదస్సులో వివిధ అంశాలపై పలువురు నిపుణులు ప్రసంగించారు. ఆయా అంశాలకు సంబంధించిన ఆధునిక విజ్ఞానాన్ని పరస్పరం పంచుకుంటూ, ప్రశ్నోత్తరాల ద్వారా సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సదస్సులో భాగంగా పలు కీలక అంశాలపై అను మై బేబీ హాస్పిటల్ నందు వర్క్ షాపులు నిర్వహించారు. ఈ సీఎంఈకి చీఫ్ ప్యాట్రన్లుగా డాక్టర్ గాజుల రమేష్, డాక్టర్ జి. శ్రీదేవి వ్యవహరించగా, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రమోద్ చలసాని, సెక్రటరీ డాక్టర్ శివరాం అక్కినేని, వీవోజీఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ వెల్లంకి శ్రీదేవి, సెక్రటరీ డాక్టర్ వెల్లంకి సుజాతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సైంటిఫిక్ కమిటీ సభ్యులుగా డాక్టర్ తీగల రమేష్, డాక్టర్ కె.ఎన్. శ్వేత, డాక్టర్ కవిత బత్తుల, డాక్టర్ గురు ప్రసాద్ పేరూరి, డాక్టర్ ఎస్. కిరణ్ కుమార్ వ్యవహరించారు. డాక్టర్ కె.వి. రవికుమార్, డాక్టర్ కె. దుర్గా నాగరాజు, డాక్టర్ పి. విశ్వేశ్వరరావు సీఎంఈ ఆర్గనైజింగ్ సెక్రటరీల హోదాలో సదస్సును విజయవంతం చేసేందుకు కృషి చేశారు.