– ఈసీఐ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపునకు పూర్తిస్థాయిలో సిద్ధం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి జూన్ 4న చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు.. జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, డీఆర్వో వి.శ్రీనివాసరావు తదితరులతో కలిసి ఆదివారం సందర్శించారు. ఇబ్రహీంపట్నం, జూపూడిలోని నోవా, నిమ్రా కళాశాలల్లో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు చేసిన ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేసిన మూడంచెల భద్రతా ఏర్పాట్లతో పాటు ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు కౌంటింగ్ గదుల్లో చేపట్టిన చర్యలను సమీక్షించారు. కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు తదితరులతో పాటు ఇతర సహాయ, భద్రతా సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొననున్న నేపథ్యంలో ప్రణాళిక ప్రకారం పార్కింగ్, భద్రత, సెల్ఫోన్ కలెక్షన్ల పాయింట్లు, సీసీ కెమెరాల నిఘా తదితరాలకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు సంబంధించి స్క్రుటినీ, లెక్కింపునకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని.. సూక్ష్మ పరిశీలన, సీసీ కెమెరాల నిఘా మధ్య ప్రక్రియను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎక్కడా ఎలాంటి గందరగోళానికి తావులేకుండా సరైన విధంగా బ్యారికేడింగ్ చేయడంతో పాటు సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మీడియా కేంద్రం ద్వారా రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు తదితరాలు మీడియా సెంటర్లో అందుబాటులో ఉంటాయన్నారు. అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అల్పాహారం, భోజనం, తాగునీరు, మరుగుదొడ్లు వంటి ఏర్పాట్లు ఉంటాయన్నారు. సమష్టి కృషితో జిల్లాలో పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో అదే స్ఫూర్తితో కీలకమైన కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే రౌండ్ల వారీగా అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. కలెక్టర్ వెంట పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి కె.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో సీహెచ్ నాగలక్ష్మి తదితరులు ఉన్నారు.