– సమష్టి కృషితో వృద్ధులపై వేధింపుల నివారణకు పాటుపడదాం
– వృద్ధుల సంక్షేమ చట్టాల పటిష్ట అమలుపై ప్రత్యేక దృష్టి
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వృద్ధులకు ఆప్యాయత, ప్రేమానురాగాలను పంచుదామని.. వారి శ్రేయస్సుతోనే సమాజానికి ఉషస్సు అని కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు.
ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడ, గాంధీనగర్, హోటల్ ఐలాపురంలో ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. తొలుత ఐలాపురం హోటల్ వద్ద కలెక్టర్ ఎస్.డిల్లీరావును మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య సత్కరించారు. అదే విధంగా కలెక్టర్ డిల్లీరావు.. ఐలాపురం వెంకయ్యను సత్కరించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ అబ్యూస్ (ఐఎన్పీఈఏ) స్వచ్ఛంద సంస్థ తొలిసారిగా 2006, జూన్ 15న ప్రపంచ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వృద్ధుల శారీరక, మానసిక ఆరోగ్యానికి, ఆర్థిక భద్రతకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాల్సిన అవసరముందని.. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో వృద్ధులు గౌరవప్రద జీవితానికి భరోసా కల్పిద్దామని పిలుపునిచ్చారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టం-2007, వయోవృద్ధుల సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన పెంపొందించి.. వాటిని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. వేధింపులకు సంబంధించి వృద్ధుల ఫిర్యాదులపై డివిజన్ స్థాయిలో సత్వర పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. జిల్లాస్థాయి కమిటీలు ఎప్పటికప్పుడు సమావేశమై నాణ్యమైన చర్చలతో మంచి ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. గొప్ప కుటుంబ వ్యవస్థకు నిలయమైన మన దేశంలో వృద్ధులపై వేధింపుల ఘటనలు చోటుచేసుకుంటుండటం దురదృష్టకరమని.. వీటికి కారణాలను గుర్తించి, సరైన కార్యాచరణ ద్వారా వేధింపులకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. నైతిక విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా మెరుగైన సమాజం నిర్మితమవుతుందని.. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా దేశ సామాజిక ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన, అన్ని విధాలా అభివృద్ది పథంలో నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కలెక్టర్ డిల్లీరావు పేర్కొన్నారు.
వృద్ధుల సంక్షేమానికి జిల్లాలో విశేష కృషి: ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వేమూరు బాబూరావు
ఎన్టీఆర్ జిల్లాలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు గారి నేతృత్వంలో వృద్ధుల సంక్షేమానికి విశేష కృషి జరుగుతోందని జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వేమూరు బాబూరావు అన్నారు. వృద్ధులకు సామాజిక భద్రతా పెన్షన్ మొత్తాన్ని రూ. 4 వేలకు పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏటా జరుపుకుంటుంన్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. వృద్ధులపై వేధింపులకు పాల్పడకుండా సామాజికంగా రావాల్సిన మార్పులు, అన్ని వర్గాల సమష్టి కృషి, వృద్ధ మిత్ర కార్యక్రమం అమలు, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాల అమలు, న్యాయ సహాయం, వినూత్న అవగాహన కార్యక్రమాలు, సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించడం తదితరాలపై వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి మోతుకూరి వెంకటేశ్వరరావు, హెల్పేజ్ ఇండియా ప్రతినిధి లంకపల్లి మృణాల్, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.చంద్రమౌళి, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్దుల సంక్షేమ శాఖ ఏడీ వి.కామరాజు, వాసవ్య మహిళా మండలి ప్రెసిడెంట్ డాక్టర్ బి.కీర్తి, డాక్టర్ సీఎల్ వెంకటరావు, సీవీ బాబు, ప్రజా కళాకారులు పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.