– పేపర్-1కు 49.22 శాతం, పేపర్-2కు 48.88 శాతం హాజరు.
– అధికారులు, సిబ్బందికి కలెక్టర్ ఎస్.డిల్లీరావు అభినందనలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో ఆదివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)- సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. మొత్తం 11,112 మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా విజయవాడలో 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా కలెక్టర్ డిల్లీరావు ఎస్ఆర్ఆర్, సేవీఆర్ బాలికల కళాశాల, బిషప్ అజరయ్య జూనియర్ కళాశాల కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్షలను ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులకు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గనిర్దేశనం చేశారు. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు మొత్తం 11,112 మంది అభ్యర్థులకు గాను ఉదయం 9.30 గం. నుంచి 11.30 గం. వరకు జరిగిన పేపర్-1కు 5,469 మంది (49.22 %), మధ్యాహ్నం 2.30 గం. నుంచి 4.30 గం. వరకు జరిగిన పేపర్-2కు 5,431 మంది (48.88 %) హాజరయ్యారు. పరీక్షలను సజావుగా నిర్వహించడంలో భాగస్వాములైన సూపర్వైజర్లు, సహాయ సూపర్వైజర్లు, రూట్ అధికారులు తదితరులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా పరీక్షను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య ఆరోగ్యం, విద్యుత్, జీవీఎంసీ, ఆర్టీసీ తదితర విభాగాల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు పేర్కొన్నారు.