-గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మెరుగైన అవకాశాలు కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి కలలు కన్న రాష్ట్ర అభివృద్ధి సాకారం అవుతుంది
-ముఖ్యమంత్రి సచివాలయ ఉద్యోగులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తారని నమ్మకం ఉంది : ఎం.డి.జాని పాషా.
-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీలో అత్యంత బాధ్యతగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించారు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రభుత్వ భవిష్యత్తు లక్ష్యాల సాధన కోసం మరియు రాజధాని అమరావతి నిర్మాణం కోసం సచివాలయ ఉద్యోగులు శక్తి వంచన లేకుండా పని చేస్తారని తెలిపారు. ఉన్నత విద్యావంతులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రివర్యులు నారా.చంద్రబాబు నాయుడు సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏ శాఖలో అయినా ప్రమోషన్ తీసుకునే విధంగా ఒక అవకాశం కల్పించి మెరుగైన ప్రమోషన్లు కల్పించి ఉన్నత స్థాయిలో ఉద్యోగుల సేవలు మరింత సమర్ధవంతంగా వినియోగించుకునే అవకాశాలు పరిశీలించి ప్రభుత్వం ఆలోచన చేయాలని,తద్వారా యువ ఉద్యోగులు తమ సామర్ధ్యం మేరకు మరింత సమర్ధవంతంగా తమ సేవలు అందిస్తారని తెలిపారు.
జులై 1న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యన్.టి.ఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం విజయంతం చేయడానికి యువ ఉద్యోగులు అవిశ్రాంతంగా కృషి చేశారని తెలిపారు. ప్రభుత్వ లక్ష్య సాధన కోసం సచివాలయ ఉద్యోగులు స్పూర్తిదాయకంగా పనిచేసారని ఎం.డి.జాని పాషా ఈ సందర్బంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.