-అధికారులు పరిశ్రమల తనిఖీ ఎప్పటికప్పుడు చేపడుతూ పర్యవేక్షణ ఉండాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశ్రమలలో నిబంధనల మేరకు భద్రతా ప్రమాణాలు పాటించాలని, అధికారులు పరిశ్రమల తనిఖీ ఎప్పటికప్పుడు చేపడుతూ పర్యవేక్షణ ఉండాలని అధికారులను జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు.
మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమలలో భద్రత చర్యలపై కలెక్టర్ సమీక్షిస్తూ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు అమలు, వాటిపై పర్యవేక్షణ ఉండాలని, ప్రమాదాల నివారణకు తరచూ సంబందిత అధికారులు సేఫ్టీ మెజర్మెంట్ పై పరిశ్రమల్లో అవగాహన కలిగించి అప్రమత్తం చేసి తప్పని సరిగా నిబంధనలు అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో A కేటగిరీ కింద 12 మేజర్ యాక్సిడెంట్ హజార్డస్ పరిశ్రమలు, B1 కేటగిరీ కింద 59 పరిశ్రమలు, B2 కేటగిరీ కింద 48 పరిశ్రమలు ఉన్నాయని వాటిని తనిఖీ చేయడం జరిగిందని, మెరుగైన భద్రత ప్రమాణాల అమలు కొరకు నోటీస్ లు ఇవ్వడం జరిగిందని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణా రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, జోనల్ మేనేజర్ ఏపిఐఐసి తిరుపతి చంద్రశేఖర్, జడ్ ఎం, ఏపీఐఐసి స్పెషల్ జోన్ తిరుపతి విజయరత్నం, ఈఈ కాలుష్య నియంత్రణ మండలి అశోక్ కుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య, తదితర అధికారులు, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు.