– జాతీయ రహదారుల పెండింగ్ పనుల సత్వర పూర్తికి కృషిచేయాలి
– డయేరియాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు.
– తండాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
– విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి భాగస్వామ్యంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషిచేద్దామని, సరైన ప్రణాళికలతో నిధుల సక్రమ వినియోగంతో మంచి ఫలితాలు వస్తాయని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు.
గురువారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), జిల్లా కలెక్టర్ డా. జి.సృజన.. జాతీయ రహదారులు, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటి సరఫరా, జీజీహెచ్ కార్యకలాపాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్హెచ్ఏఐకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు, డీపీఆర్, సర్వీసు రహదారులు, విస్తరణ పనుల పూర్తికి ఎదురవుతున్న సమస్యలు తదితరాలపై చర్చించారు. అదే విధంగా జిల్లాలో డయేరియాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళికాయుతంగా తీసుకుంటున్న చర్యలు, ఎ.కొండూరు డయాలసిస్ కేంద్రం సేవలు; జల జీవన్ మిషన్ పనులు, పైపులైన్ల మరమ్మతులు, ఓహెచ్ఎస్ఆర్ల స్థితిగతులు తదితరాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ బైపాస్ పనుల సత్వర పూర్తికి అవరోధంగా ఉన్న హైటెన్షన్ లైన్ల మార్పు పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని, పరిహారం చెల్లింపు ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలన్నారు. నగర ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వీలుగా ఎన్హెచ్-16లో మహానాడు రోడ్డు నుండి నిడమనూరు వరకు మెగా ఫ్లైఓవర్కు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపకల్పనపై దృష్టిసారించాలన్నారు. ఎ.కొండూరు ప్రాంత ప్రజలకు కిడ్నీ సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా తాగునీటి వ్యవస్థల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని.. ఎ.కొండూరు డయాలసిస్ కేంద్రం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేయాలన్నారు. సేవలు అవసరమైన వారిని గుర్తించి.. పూర్తిస్థాయిలో సేవలందించాలన్నారు.
ఇప్పటి వరకు జిల్లాలో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టిన పనులపై సమీక్షించారు. తాగునీటి సరఫరా పనులకు సంబంధించి డీపీఆర్లు కూడా తయారు చేయాలని సూచించారు. ఎన్ఆర్ఈజీఎస్, ఎంపీల్యాడ్స్, సీఎస్ఆర్ నిధుల వినియోగంతో తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థల మెరుగుతో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. పాడైన పైపులైన్లు, ఓహెచ్ఎస్ఆర్ల తక్షణ మరమ్మతుల పనులకు సంబంధించి చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో దృష్టికి వచ్చిన అంశాల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. త్వరలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, సమస్యల పరిష్కారానికి కృషిచేయనున్నామన్నారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, డీఆర్వో వి.శ్రీనివాసరావు, విజయవాడ ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్, ఎన్హెచ్ఏఐ పీడీ పార్వతీశం, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ డీవీ రమణ, డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని తదితరులు పాల్గొన్నారు.