-పరిశ్రమ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత
-అన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారం
-రాష్ట్రంలోని అన్ని వ్యవస్ధలను బ్రస్టు పట్టించిన జగన్ మోహన్ రెడ్డి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జౌళి పరిశ్రమకు గత ప్రభుత్వం నుండి రావలసిన బకాయిల విడుదల చేయించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత హామీ ఇచ్చారు. కల్తీ కాటన్ నివారణకు వివిధ శాఖలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలోని టెక్స్ టైల్, స్పిన్నింగ్, జిన్నింగ్ పరిశ్రమల ప్రతినిధులతో సచివాలయంలో మంత్రి సోమవారం ఉన్నత స్దాయి సమావేశం నిర్వహించారు. జౌళి పరిశ్రమ ఎదుర్కుంటున్న సమస్యలను అయా ప్రతినిధులు మంత్రి సవిత దృష్టికి తీసుకువచ్చారు. పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు నుండి రావలసిన రూ.1400 కోట్లను వెంటనే విడుదల చేయించాలన్నారు. గతంలో మాదిరి ప్రత్యేక జౌళి పాలసీ తీసుకురావాలని, లోకల్ లేబర్ కి 75 శాతం ఉపాధి కల్పన నిబంధన సడలించాలని, జీవో 21 రద్దు చేయాలని కోరారు. ప్రత్తి పై దిగుమతి సుంకం తగ్గించాలని, తమ సంస్ధల ద్వారా ఉత్పత్తి అయ్యే మిగులు విద్యుత్త్ ను తిరిగి తమ అవసరాలకు వినియోగించుకునేలా విధాన రూపకల్పన జరగాలని విన్నవించారు. వివిధ రాయితీలు కొనసాగస్తూ కల్తీ పత్తిని అరికట్టాలని కోరారు. ఈ నేపధ్యంలో మంత్రి సబిత వారి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు చేనేత జౌళి శాఖను పునరుజ్జీవింప చేయటానికి కట్టుబడి ఉన్నారన్నారు. గత ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అన్ని వ్యవస్ధలను భూస్దాపితం చేసిందని, ముఖ్యమంత్రి ఈ పరిస్ధితి నుండి రాష్ట్రాన్ని బయటకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. జౌళి పరిశ్రమ ఎదుర్కుంటున్న అన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరింప చేస్తామని వివరించారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత, శాఖ ఇన్చార్జి కమిషనర్ శ్రీకాంత్ ప్రభాకర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.