విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రవాణాశాఖ ఆన్ లైన్ సేవలను ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వ పోర్టల్ ఈ-ప్రగతితో పాటు కేంద్రప్రభుత్వ వెబ్ సైటు వాహన్ ద్వారా అందిస్తూ వచ్చిన అధికారులు ఇకపై ఈ-ప్రగతి స్థానంలో వాహన్ పోర్టల్ ను విస్తరించేందుకు ఎన్టీఆర్ జిల్లాలో చేపట్టిన డేటా బదలాయింపు ప్రక్రియ వల్ల వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగుమోతు రాజా అన్నారు.
శనివారం ఉదయం విజయవాడలోని ది కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాలులో జరిగిన మీడియా సమావేశంలో రాజా మాట్లాడుతూ పలు సేవల వివరాలు వాహన్ పోర్టల్ లో కనిపించడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు మాట్లాడుతూ 2016లో ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖలో ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాయని, కేంద్రప్రభుత్వం ఎన్.ఐ.సీ.(నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్) ద్వారా రూపొందించిన వాహన్ పోర్టల్ లో ఏపీ రవాణాశాఖ 2021లో చేరిందని, వాహన్ వెబ్సైట్ నెమ్మదిగా ఉండటం, ఈ-ప్రగతిలో ఉండే అనేక మాడ్యూల్స్ అందులో లేకపోవడంతో వాహనాల డేటా ట్రాన్స్ ఫర్ ప్రక్రియ జాప్యమవుతోందన్నారు. గత పదిహేను రోజులుగా ఎన్టీఆర్ జిల్లాలోని లారీలకు సంబంధించిన ట్రాన్స్ఫర్, రెన్యువల్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఎన్వోసీల జారీ, త్రైమాసిక పన్నులు, ఈ-చలాన్ల చెల్లింపు, ఈ-పర్మిట్ల జారీ తదితర సేవలు నిలిచిపోయి వాహనదారులు ఆందోళన చెందుతున్నారన్నారు.
ప్రధాన కార్యదర్శి అల్లాడ వీరవెంకట సత్యనారాయణ మాట్లాడుతూ జులై 8 నుండి ప్రయోగాత్మకంగా వాహనాల డేటాను ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ వెబ్ సైట్ ‘ఈ-ప్రగతి’ నుంచి వాహన్ పోర్టల్ (ఎన్.ఐ.సీ. సర్వర్) లోకి బదిలీ చేయడానికి
ఎన్టీఆర్ జిల్లాను కాకుండా తక్కువ వాహనాలు ఉండే జిల్లాను ఎంపిక చేసి ఉండాల్సిందన్నారు.