-కలెక్టర్ జి.సృజన అధ్యక్షతన సమావేశమైన స్టీరింగ్ కమిటీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలోని 125 అడుగుల డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్ప సందర్శనకు వచ్చేవారికి పర్యటన మధురానుభూతి మిగిల్చేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని.. ఇదేవిధంగా మరిన్ని సౌకర్యాలతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అధికారులకు సూచించారు. శనివారం డా. బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం, స్మృతివనాన్ని కలెక్టర్ సృజన సందర్శించారు. అనంతరం ప్రాంగణంలోని విహార మినీ థియేటర్లో కలెక్టర్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. హరిత ప్రాంతం, ఫౌంటెయిన్లు, ఆర్వో ప్లాంట్ నిర్వహణ; వాహనాల పార్కింగ్ ప్రాంత విస్తరణ, భద్రత తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ డా. బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం, మ్యూజికల్ ఫౌంటెయిన్, కుడ్య చిత్రాలు, అంబేద్కర్ చైత్య ఎక్స్పీరియన్స్ సెంటర్ తదితరాల సందర్శనకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు పర్యటన గొప్ప అనుభవంగా మిగిల్చేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని.. ఇకపైనా అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ పటిష్ట పర్యవేక్షణతో సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు తదితరాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. అభివృద్ధి చేసిన హరిత ప్రాంత అందం చెక్కుచెదరకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు వాహనాల పార్కింగ్ విస్తరణపైనా దృష్టిసారించాలన్నారు. ఫౌంటెయిన్ల నిర్వహణకుగాను మునిసిపల్ వాటర్కు ప్రత్యేక లైన్ ఏర్పాటు, 74 సీట్ల డాల్బీ ఆటమ్స్ విహారా మినీ థియేటర్ను సందర్శకులకు అందుబాటులో ఉంచడం; భద్రతా సిబ్బందికి సంబంధించి టెండర్ ప్రక్రియ తదితర అంశాలపైనా సమావేశంలో చర్చించారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి స్టీరింగ్ కమిటీ ద్వారా ప్రభుత్వానికి నివేదించాల్సిన అంశాలతో పాటు ప్రాజెక్టుకు సంబంధించి మిగిలియున్న పనులపైనా సమావేశంలో చర్చించారు.
సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ డా. ఎ.మహేశ్, అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్టులు) కేవీ సత్యవతి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె.శ్రీనివాసరావు, ఏపీఐఐసీ జెడ్ఎం కె.సీతారాం, కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ ప్రతినిధి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.