-వివరణ ఇచ్చిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయటానికి కట్టుబడి వున్నాము. నిత్యం ప్రయాణీకులతో రద్దీగా వుండే ఈ స్టేషన్ కోసం రాబోయే 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించటం జరిగింది. ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా విజయవాడ రైల్వేస్టేషన్ అభివృద్ది పనులు, అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణం పనులు ఒకేసారి చేసేందుకు ప్రణాళికా రూపకల్పన చేసినట్లు పార్లమెంట్ లో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బదులిచ్చారు. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ పూర్తి అయినట్లు తెలిపారు.
అమరావతిలో పెండింగ్ రైల్వే లైన్ల నిర్మాణం, వాటి నిధుల కేటాయింపు, నిధుల వినియోగం గురించి ఎంపి కేశినేని శివనాథ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను వివరణ కోరారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద విజయవాడ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ది పనులు తెలియజేయాలని అనుబంధ ప్రశ్నగా అడగటం జరిగింది
దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైల్వే అభివృద్ది కేంద్రం కట్టుబడి వుందన్నారు. 2009, 2014 మధ్య సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఏడాదికి సగటు కేటాయింపు 886 కోట్ల రూపాయలు గా వుండేది. గత పదేళ్ల కాలంలో రైల్వే అభివృద్ధి కోసం చాలా నిధులు కేటాయించటం జరిగిందన్నారు. 2023-2024 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రానికి 8,406 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వెల్లడించారు. గత పదేళ్ల కాలంలో ఏడాదికి 151 కిలోమీటర్ల చొప్పున రైల్వే ట్రాక్ పనుల నిర్మాణం జరిగినట్లు తెలిపారు.
విజయవాడ రైల్వే స్టేషన్ కి అతి సమీపంలో వున్న అమరావతి రాజధానికి కనెక్టివిటీ పెంచేందుకు 56 కిలోమీటర్లతో కొత్త రైలు ట్రాక్ తో పాటు 2000 వేల కోట్ల రూపాయల వ్యయంతో అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. దీనికి సంధించి నీతి ఆయోగ్ క్లియరెన్స్ వచ్చినట్లు పేర్కొన్నారు.