-ఆగస్ట్ 1వ తేదీన పెన్షన్ లబ్ధిదారులు ఇంటి వద్ద అందుబాటులో ఉండాలి
-జిల్లాలో 2,67,772 మంది లబ్దిదారులకు సుమారు రూ.113.17 కోట్లు పంపిణీకి చర్యలు: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జూలై మాసపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే ఆగస్ట్ 1న ఉదయం 6 గం. నుండి పంపిణీ చేయనున్నట్లు మరియు సాంకేతిక కారణాలవలన మిగిలిపోయిన వారికి 2వ తేదీలో పంపిణీ చేయనున్నట్లు తెలుపుతూ లబ్ధిదారులు1వ తేదీన వారి ఇంటి వద్ద అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లాలో 2,67,772 మంది లబ్దిదారులకు సుమారు రూ.113.17 కోట్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్యం వృద్దాప్య, వితంతు, చేనేత, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలకు, మత్స్యకారులకు, HIV వ్యాధి గ్రస్తులకు, చర్మకారులకు, హిజ్రాలకు మరియు డప్పు కళాకారులకు రూ.3,000/- ల నుండి రూ.4,000/- వరకు పెంచడమైనదని, అలాగే వికలాంగుల పెన్షన్ లు రూ.3,000/- ల నుండి రూ.6,000/- వరకు పెంచడమైనదని, DMHO పెన్షన్ లు రూ.5,000/- ల నుండి రూ.10,000/- వరకు పెంచడమైనదని, ఇందులో శాశ్వత వికలాంగులకు రూ.5,000/- ల నుండి రూ.15,000/- వరకు పెంచడమైనదని తెలిపారు.
ఆగస్ట్ 1న ఉదయం 6గం. ల నుండి సచివాలయ సిబ్బంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేస్తారని అదే రోజు 99 శాతం తగ్గకుండా పూర్తి చేయాలని, సాంకేతిక కారణాలవలన ఇంకనూ మిగిలిపోయిన వారికి 2వ తేదీన పంపిణీ చేస్తారని, పెన్షన్ లబ్ధిదారులు అందరూ 1 వ తేదీనే ఎవరి ఇంటి వద్దనే వారు ఉండి పెన్షన్ తీసుకోవాలి అని, బయట గ్రామాలకు వెళ్ళిన వారు కూడా 1 వ తేదీన తమ పెన్షన్ ఉన్న గ్రామాలలో తమ ఇంటి వద్ద వుండి పెన్షన్ తీసుకోవాలని తెలిపారు. సదరు అంశాన్ని గ్రామాల్లో టామ్ టామ్, మైక్ ద్వారా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని, పెన్షన్ లబ్దిదారులు ఎవరూ సచివాలయ కార్యాలయానికి రావలసిన అవసరం లేదని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.