గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర కమిషనర్ గా పూర్తి సంతృప్తిగా విధులు నిర్వహించామని, తమ విధి నిర్వహణలో అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో నగర అభివృద్ధికి కృషి చేశామని ఏపి ట్రాన్స్కో జెఎండిగా బదిలీ అయిన కీర్తి చేకూరి అన్నారు. శనివారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో బదిలీ అయిన కీర్తి చేకూరికి అధికారులు, ప్రజా ప్రతినిధులు వీడ్కోలు, అభినందన సభ నిర్వహించారు.
నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ అధ్యక్షతన జరిగిన సభలో కీర్తి చేకూరి మాట్లాడుతూ గుంటూరు నగర కమిషనర్ గా 2ఏళ్ల 3 నెలల కాలం ఎంతో సంతృప్తిగా విధులు నిర్వహించామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు నగర అభివృద్ధికి ఎంతగానో సహకరించారని, ప్రదానంగా రోడ్ల విస్తరణ, కాలనీల్లో పార్క్ ల అభివృద్ధికి కృషి చేశామన్నారు. నగరపాలక సంస్థ ఔట్సొర్సింగ్ కార్మికులకు ప్రమాద భీమా కల్పించడం తనకు వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్ని అందించిందని పేర్కొన్నారు. సాదారణ ఎన్నికలు కూడా ఏ విధమైన అవాంతరాలు లేకుండా ద్విగిజయంగా చేపట్టామన్నారు. గుంటూరు నగర ప్రజలు చైతన్యవంతంగా ఉంటారని, ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకురావడంలో వారు ముందుంటారన్నారు. గుంటూరు నగరం స్వంత నగరంగా బంధం ఏర్పడిందని, రానున్న కాలంలో గుంటూరు నగరం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
గుంటూరు తూర్పు ఎంఎల్ఏ మహ్మద్ నసీర్ మాట్లాడుతూ కీర్తి చేకూరి సమర్ధత సాదారణ ఎన్నికల్లో అందరికీ తెలిసిందని, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం, అత్యంత వేగంగా రిజల్ట్ రావడంలోనూ కీర్తి చేకూరి ప్రత్యేక శైలి తెలిసిందన్నారు. విధుల్లో ఎంత ఒత్తిడిలు ఉన్నా నిబందనలు తుచ తప్పకుండా పాటించేవారని, క్షేత్ర స్థాయి సిబ్బందిగా అండగా నిలవడం ఆమె నైజం అని అన్నారు. భవిష్యత్ లో ప్రజా సేవలో మరిన్ని ఉన్నత భాధ్యతలు పొందాలని కోరుకుంటున్నామన్నారు.
గుంటూరు ఆర్బన్ ఎస్.పి. ఎస్.సతీష్ కుమార్ మాట్లాడుతూ కీర్తి తమకు బ్యాచ్ మేట్ అని, విధి నిర్వహణలో అందరినీ కలుపుకొని, తను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. గుంటూరు నగరాభివృద్ధిలో కీర్తి కి ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు.
అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. తొలుత విభాగాధిపతులు, డిప్యూటీ కమిషనర్లు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు మాట్లాడారు. కార్యక్రమంలో డిఆర్ఓ పి.రోజా, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, ఇంచార్జి కమిషనర్ శ్యాం సుందర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంహెచ్ఓ మధుసూదన్, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, వెంకట లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.