మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగస్టు ఒకటవ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కొన్ని మండలాల అధికారులు, సచివాలయ ఉద్యోగులు అలసత్వం ప్రదర్శించారని, ఈ సారి అలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా చేపట్టాలని ఆదేశించారు. పంపిణీకి ముందు రోజు గ్రామం లేదా పట్టణంలోనే తప్పనిసరిగా ఉండాలని, వారి పరిధిలోని లబ్ధిదారుల జాబితా ప్రకారం రూట్ మ్యాప్ ను రూపొందించుకొని ప్రణాళిక బద్ధంగా పంపిణీ చేపట్టాలన్నారు. పంపిణీ కార్యక్రమం ఉదయం నుంచే ప్రారంభించడం ద్వారా సర్వర్ పై ఒత్తిడి ఉండదని, యాప్ లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉండదన్నారు.
గన్నవరం మండలంలోని కొత్తగూడెం సచివాలయానికి చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగి అయిన కే పావని ఎనిమిది నెలల గర్భిణీ అయినప్పటికీ ఉదయం నాలుగు గంటల నుంచే పింఛన్లను పంపిణీ చేసి 99 శాతం పూర్తి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిందని, పావనితో పాటు ఎంపీడీవో సత్య కుమార్ ను కలెక్టర్ అభినందించారు. ఆ అంకితభావం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఆనంద్ కుమార్, డిఆర్డిఏ ఇంచార్జ్ పిడి నాగేశ్వర నాయక్, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మండలాల ఎంపీడీవోలు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.