-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
-సీతాయమ్మ హోటల్ వద్ద డ్రైనేజీ పరిశీలించిన ఎమ్మెల్యే, అధికారులు
అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త :
అవనిగడ్డ గ్రామ ప్రధాన డ్రైనేజీ సమస్య పరిష్కారంపై దృష్టి సారించినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. బుధవారం స్థానిక సీతాయమ్మ హోటల్ వద్ద డ్రైనేజీని ఎమ్మెల్యే పరిశీలించారు. ఆర్.డబ్ల్యూ.ఎస్ డీఈఈ పాలచర్ల సత్యనారాయణతో కలిసి అవనిగడ్డ గ్రామ డ్రైనేజీ స్వరూప మ్యాప్ పరిశీలించారు. కరకట్ట నుంచి మండపం మీదుగా మురుగు కాలువ వరకూ ఉన్న ప్రధాన డ్రైనేజీని సీతాయమ్మ హోటల్ వద్ద పరిశీలించారు. మురుగు ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్న ప్రదేశాలు మ్యాప్ ద్వారా సిబ్బంది వివరించారు. డ్రైనేజీ అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు నియోజకవర్గానికి రూ.20 కోట్లు కేటాయించిన నేపథ్యంలో డ్రైనేజీల అభివృద్ధికి ఇరవై శాతం నిధులు కేటాయించినట్లు డీఈఈ సత్యనారాయణ వివరించారు. అవనిగడ్డలోని కరకట్ట నుంచి సీతాయమ్మ హోటల్, మండపం మీదుగా మురుగు కాలువ వరకు ఉన్న డ్రైనేజీ, సీతాయిలంక డ్రైనేజీలను అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే సూచనల మేరకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, ఏఈ భోగాది జగత్, పంచాయతీ ఈఓ తోట శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.