అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీతానగరం విజయకీలాద్రి జీయర్ స్వామివారి ఆశ్రమంలో ఉభయ రాష్ట్రాల శ్రీవైష్ణవ సంఘాలతో ఏర్పడిన శ్రీభగవద్రామానుజ శ్రీవైష్ణవసంఘ సమాఖ్య మొదటి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శ్రీమాన్ మరింగంటి తిరుమొళిశై ఆళ్వార్ స్వామి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో శ్రీవైష్ణవ సంప్రదాయ దేవాలయాలు, పీఠాలు, సంఘాల మధ్య సమన్వయం సాధించాలని తద్వారా సంప్రదాయ రక్షణకు కృషి జరగాలని వక్తలు ముక్తకంఠంతో ఏకాభిప్రాయాన్ని తెలిపారు. సమాఖ్య జిల్లాలు, ప్రాంతాలు, గ్రామాలలోకి వ్యాపించి అన్ని విభాగాల మధ్య సమన్వయాన్ని సాధించాలని సూచించారు. వేదాన్ని, ఆగమాన్ని కచ్చితంగా మన భవిష్యత్తు తరాలవారు నేర్చుకునేలా ప్రోత్సహించాలని, వాటిని నేర్చుకోవడం, ఆచరించడం, వాటి విలువలను ప్రచారం చేయడం ద్వారానే సంప్రదాయ రక్షణ సాధ్యమని తెలిపారు.
ఈ సభకు ముఖ్య అతిథులుగా ఉభయవేదాంత పీఠం వేద విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్ శ్రీమాన్ ముడుంబై మధుసూదనాచార్యులు, జీయర్ స్వామి ఆశ్రమనిర్వాహకులు శ్రీమాన్ పురాణం వెంకటాచార్య స్వామివారు, నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తిగారు, చక్రవర్తుల శ్రీనివాస రామానుజాచార్యులు, జగన్మోహనాచార్యులు, అగ్రహారం రాఘవేంద్ర, అకలంకం పార్ధసారధి, వేదాంతం అచ్యుతకృష్ణ, యతిరాజుల బాలబాలాజీ ఇతర సమాఖ్య సభ్యులు, అంగలకుదురు వాసుదాసాశ్రమ నిర్వాహకులు పట్టాభి తదితరులు పాల్గొన్నారు. సమాఖ్య విధివిధానాలపై చర్చించారు.
Prajavartha Online Telugu News