మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరితో కలిసి ఆదివారం సాయంత్రం స్థానిక 2వ డివిజన్ మాచవరంలో 500 కే.ఎల్. ఎలివేటెడ్ సర్వీస్ రిజర్వాయర్ పనులు, అనంతరం 50 డివిజన్ డ్రైవర్స్ కాలనీలో 5 ఎం ఎల్ డి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమృత్ ఫేస్-1 కింద 2014-19 మధ్య 16 కోట్లతో చేపట్టిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ పనులు గత ప్రభుత్వం మధ్యలో నిలిపివేయడం వల్ల 5 కోట్లు అదనంగా వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పనులు సంపూర్ణంగా పూర్తి చేయడం జరుగుతుందన్నారు. కొద్దిపాటి వర్షానికే నగరంలో పలు ప్రాంతాలు ముంపునకు గురి కావడం, గత పాలకులు గత ఐదేళ్లలో నగర అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని అన్నారు. దీని నివారణకు డ్రైనేజీలలో పూడికతీత పనులు ఇప్పటికే చేపట్టినట్లు తెలిపారు, మచిలీపట్నం నగరంలో డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్తు, సమస్యల శాశ్వత పరిష్కారం తోపాటు నగరంలో గ్రీనరీ అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దుటకు అన్ని చర్యలు చేపడతామన్నారు.
బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రానున్న రెండేళ్లలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, తాగునీటి సమస్య పరిష్కరించడం లక్ష్యంగా తగిన ప్రణాళికలు రూపొందించడం తో పాటు, కేంద్రం నుండి మనకు రావలసిన నిధులు అమృత్ స్కీం కింద, 15 ఆర్థిక సంఘం నిధులు తేవడానికి కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, పబ్లిక్ హెల్త్ డిఇ రాంప్రసాద్, స్థానిక డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.