-వ్యాసాశ్రమంలో కిచెన్, రక్షిత మంచినీటి తదితర సదుపాయాలు మెరుగుపడాలి అని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
ఏర్పేడు, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ వ్యాసాశ్రమం, ఏర్పేడు నందు నాలుగవ తరగతి నుండి డిగ్రీ వరకు నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలల భోజనశాలను, కిచెన్ వాటి పరిసరాలను తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేసి సక్రమంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహారం నాణ్యతగా ఉండాలని పిల్లలకు రక్షిత మంచి నీరు అందించాలని పలు అంశాలపై సూచిస్తూ సదరు ఆశ్రమ నిర్వాహకులను హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం ఏర్పేడు నందు నిర్వహిస్తున్న వ్యాసాశ్రమాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేయగా అందులో చదువుతున్న 400 మంది విద్యార్థినులకు మంచి విద్య అందిస్తున్నామని ఆశ్రమ నిర్వాహకులు తెలుపగా మంచి విద్య అందించడం కొనసాగించాలని తెలుపుతూ సదరు ఆశ్రమం నందు కిచెన్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఫ్లోరింగ్ మెరుగు పరచాలని, పిల్లలకు రక్షిత మంచినీరు అందించేలా ఆర్ ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. మరుగుదొడ్లు రన్నింగ్ వాటర్ ఉండేలా పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, పిల్లలకు ఆరోగ్యం ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక ఎ ఎన్ ఎం ఏర్పాటు చేసుకోవాలని మళ్లీ 45 రోజుల్లో తనిఖీ చేస్తానని మార్పు ఉండాలని కలెక్టర్ సదరు ఆశ్రమ నిర్వాహకులను హెచ్చరించారు. అలాగే తాసిల్డార్ రెగ్యులర్ గా తనిఖీ చేయాలనీ సూచించారు. ఈ ఆకస్మిక తనిఖీలో ఆర్డీఓ శ్రీకాళహస్తి రవి శంకర్ రెడ్డి, తహశీల్దార్ ఏర్పేడు భార్గవి తదితర అధికారులు పాల్గొన్నారు.