మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వర్షం రాకపోయినప్పటికి, వరద నీరు తగ్గుముఖం పట్టేంతవరకు అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో వరద నీటి ప్రభావంపై సమావేశం నిర్వహించి రేఖ చిత్రపటం గమనిస్తూ సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుండి 11.43 లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణా నది దిగువకు వదలడం జరిగిందన్నారు. పై నుండి ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు చేరుకోవడం తగ్గిందన్నారు. అయితే అవుట్ ఫ్లో కృష్ణ డెల్టాకు వరద నీరు మాత్రం 11.43 లక్షలు కొనసాగుతూ ఏమాత్రం గత 2 ,3 గంటలుగా పెద్దగా పెరగడం లేదన్నారు. అయినప్పటికీ దిగువ ప్రాంతాలకు వరద నీరు తగ్గుముఖం పట్టేంతవరకు అధికారులు ఎవరూ కూడా విశ్రమించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా జలవనరుల శాఖ డ్రైనేజీ శాఖ అధికారులు వాగులు వంకల వద్ద రాకపోకలు సాగకుండా గట్టిగా నియంత్రణ చర్యలు కొనసాగించాలన్నారు. కాలువలపై నిరంతర నిఘా ఉంచి గండ్లు పడకుండా పర్యవేక్షించాలన్నారు.
జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చోట పడవలు పంపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల పడవలను వినియోగించి లోతట్టు ప్రాంత ప్రజలను రక్షించడం జరిగిందన్నారు. ఇంకా ఎవరైనా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వెంటనే కంట్రోల్ విభాగానికి ఫోన్ చేసిన పక్షంలో ఆదుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి డిఆర్ఓ జి శ్రీదేవి, జడ్పీ సీఈవో ఆనంద్ కుమార్, ఆర్ డబ్ల్యు ఎస్ ఈ ఈ శివప్రసాద్, డిఇఓ తహేరా సుల్తానా, డీఎస్ఓ పార్వతి, డిఎంహెచ్వో డాక్టర్ గీతాబాయి, డి సి హెచ్ ఎస్ డాక్టర్ శ్రావణ్ కుమార్, ఏపీఎంఐపి పిడి జి విజయలక్ష్మి,సర్వే భూ రికార్డుల ఏడి మనీషా త్రిపాఠి, డి టి డబ్ల్యూ ఓ ప్రకాష్ రావు, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.