గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా పరిధిలోని బుడమేరు వరద ముంపు బారిన పడిన గ్రామాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నందివాడ మండలంలోని అరిపిరాల, పోలసివారిపాలెం, రామాపురం, ఇలపర్రు గ్రామాలు బుడమేరు వరద ముంపు బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం కలెక్టర్ గుడివాడలోని మున్సిపల్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేశారు. అరిపిరాల గ్రామానికి సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి షాహిద్ బాబు, పోలాసివారిపాలెం గ్రామం మార్క్ ఫెడ్ డిఎం మురళీ కిషోర్, రామాపురం గ్రామం జిల్లా అటవీ శాఖ అధికారి కే రాజశేఖర్ రావు, ఇలపర్రు గ్రామం సర్వ శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కె రాములు నాయక్ లను ప్రత్యేక అధికారులుగా కలెక్టర్ నియమించారు.
వీరికి అదనంగా పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో, వీఆర్ఏ, పోలీసు అధికారులను అనుబంధం చేశారు. ఏర్పాటుచేసిన బస్సులు, బోట్లలో ప్రజలను నందివాడ హై స్కూల్, గుడివాడలోని పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ సూచించారు. అధికారులకు ఏ అవసరం ఏర్పడినా గుడివాడ మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రమణ్యం నిత్యం అందుబాటులో ఉంటారని, అవసరం మేరకు ఆయన్ను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో ఆనంద్ కుమార్, నందివాడ మండలం తహసిల్దార్ మల్లిక, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.