-రాష్ట్ర ఉద్యాన సంచాలకులు. డా. కె.శ్రీనివాసులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధిక వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ఉద్యాన పంటలను బుధవారం రాష్ట్ర ఉద్యాన సంచాలకులు. డా. కె.శ్రీనివాసులు సందర్శించి బాధిత రైతులకు ధైర్యం చెప్పి పంట నష్టం అంచనాలు వేయటం జరుగుతోందని అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలకు దెబ్బతిన్న ఇబ్రహింపట్నం మండలం కోటికలపూడి, కేతనకొండ, మూలపాడు గ్రామాల్లో పలు ఉద్యాన పంటలను పరిశీలించారు. ముఖ్యంగా గ్రామాలలో దెబ్బతిన్న కాలిఫ్లవర్, మిరప, ఆకుకూరలు, కరివేపాకు ,ఇతర కూరగాయ తోటలను,మూలపాడు గ్రామంలోని మామిడి మరియు పామ్ ఆయిల్ తోటలను పరిశీలించి పంట నష్టాన్ని పరిశీలించారు. అధిక వర్షాలు, వరద ముంపు ప్రాంతాలలో దెబ్బతిన్న ఉద్యాన పంటలలో తీసుకోవలసిన జాగ్రత్తలను రైతులకు ఉద్యాన అధికారులు సకాలములో తెలియచేసారా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. వివిధ ఉద్యాన పంటలలో ఇప్పటి వరకు అయిన పంట సాగు ఖర్చుల వివరములను రైతులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా అందవలసిన సహాయానికి ప్రతిపాదనలను సమర్పిస్తామని తెలియజేసారు. వివిధ పంటల నష్టాన్ని పరిశీలించి, రైతు వారీగా జాబితాలు తయారుచేసేందుకు సమాయత్తం కావాలని ఉద్యాన సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలో 5,228 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు ఉద్యాన సహాయకు కు వివరించారు. పర్యటనలో జిల్లా ఉద్యాన అధికారి, పి బాలాజీ కుమార్, మండల ఉద్యాన అధికారులు. నీలిమ, కిరణ్మయి, గ్రామ వ్యవసాయ సహాయకులు, నరేంద్ర నాయక్ మరియు రైతులు పాల్గొన్నారు.