-జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా.నిధి మీనా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి నుండి వచ్చే ఏడాది 2025 ఫిబ్రవరి 28 వరకు జిల్లా వ్యాప్తంగా 21వ అఖిల భారత పశుగణన ప్రక్రియ జరుగుతుందని, నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ డా. నిధి మీనా కోరారు.
జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు గణన ప్రక్రియను శుక్రవారం జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ నిధిమీనా, శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు, గద్దె రామ్మోహన్ రావు ఇంటి వద్ద నుండి పశుసంవర్ధక శాఖ జేడీ యం. హనుమంతరావు ఇతర అధికారులతో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి నుంచి 2025 ఫిబ్రవరి, 28 వరకు నిర్వహించే 21వ అఖిల భారత పశుగణన ప్రక్రియను జిల్లాలో విజయవంతంగా చేపట్టాలన్నారు. పశుసంవర్ధక శాఖ సిబ్బంది జిల్లాలోని ప్రతి ఇంటిని సందర్శించి వివరాలను నమోదు చేస్తారన్నారు. జిల్లాలోని 7 లక్షల రెండువేల900 కుటుంబాలను సందర్శించి వివరాలు సేకరిస్తారన్నారు. వికసిత్ ఆంధ్ర ప్రణాళిక రూపకల్పనకు పశుగణన ప్రక్రియ ఉపయోగపడుతుందన్నారు. పశుగణన దేశవ్యాప్తంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్నారు.అన్ని సాధుజంతువుల వివరాలు అనగా గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు, పోనీస్ గాడిదలు మిథున్స్ యాక్స్, కంచర గాడిదలు, ఒంటెలు, ఏనుగులు, కుక్కులు మరియు కుందేళ్లు, పక్షిజాతులైన కోళ్లు, బాతులు, టర్కీకోళ్లు, మరియు ఇతర పెంపుడు జంతువుల వంటి 16 రకాల వివరాలు గణన చేస్తారన్నారు. ఇందుకు జిల్లాలో అన్ని మండలాలకు అవసరమైన సిబ్బందిని, సూపర్వైజర్ల ను నియమించి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో 241మంది ఎన్యుమరేటర్స్, 47 మంది సూపర్వైజర్లు నియమించిడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టిన 21వ అఖిలభారత పశుగణన ప్రక్రియపై పాడి రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఇంచార్జ్ కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం 21వ అఖిలభారత పశుగణన ప్రక్రియపై రూపొందించిన నియమావళి పుస్తకాలు, ట్రావెలింగ్ కిట్లు, గోడపత్రికను ఇంచార్జ్ కలెక్టర్ పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఉపసంచాలకులు డా. వి.గోపీచంద్ ,ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.