– పరిశీలన ప్రక్రియను వీడియో లో చిత్రీకరించాం
– సెక్షన్ 36 నిబంధనలను తు.చ. తప్పక పాటించాం.
– విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో సక్రమంగా ఉన్న 19 మంది నామినేషన్లు.
– జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిష్పక్షపాతంగా, అత్యంత పారదర్శకంగా విజయవాడ పార్లమెంటరీ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చట్ట నిబంధనలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్ల పరిశీలన జరిగినట్లు తెలిపారు. రిటర్నింగ్ అధికారులు నిర్వహించిన మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేసినట్లు వెల్లడించారు. రిటర్నింగ్ అధికారులకు వివిధ రౌండ్లలో ఇచ్చిన నాణ్యమైన శిక్షణ, సందేహాల నివృత్తి సెషన్ల వల్ల ఎలాంటి గందరగోళానికి తావులేకుండా నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరిగినట్లు పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 36 నిబంధనలను కూడా తు.చ. తప్పకుండా పాటించినట్లు తెలిపారు. చెల్లుబాటు అయిన నామినేషన్లకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను ఫారం-4 ద్వారా వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ అభ్యర్థుల జాబితాను ఫొటోలతో సహా నోటీస్ బోర్డులో ప్రదర్శించినట్లు తెలిపారు. ఈ నెల 29 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు వీలుంటుందని.. అనంతరం ఫారం-7ఏ ద్వారా పోటీలో నిలిచిన అభ్యర్థుల జాబితాను నోటిఫై చేయనున్నట్లు కలెక్టర్ డిల్లీరావు వెల్లడించారు.
విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం-చెల్లుబాటైన నామినేషన్లు: విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 19 మంది నామినేషన్లు చెల్లుబాటు కాగా.. 15 మంది నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురైనట్లు తెలిపారు. నామినేషన్లు సక్రమంగా ఉన్నవారి జాబితాలో కేశినేని శివనాథ్ (చిన్ని)-తెలుగుదేశం, కేశినేని శ్రీనివాస్ (నాని)-యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, భార్గవ్ వల్లూరు (భారత జాతీయ కాంగ్రెస్), మేకా వెంకటేశ్వరరావు (బహుజన సమాజ్ పార్టీ), కృష్ణ కిషోర్ యనమండ్ర (నవతరం పార్టీ), గుజ్జుల లలిత (సోషలిస్టు యూనిటి సెంటర్ ఆఫ్ ఇండియా (కమ్యూనిస్టు); చాగంటిపాటి గంగాధర్ గాంధీ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), చింతలచెరువు హేమలత (జై మహాభారత్ పార్టీ), ఎన్.దశరథ రామిరెడ్డి (ఆలిండియా జైహింద్ పార్టీ), దాట్ల లూర్థు మేరి (జైభీమ్ రావ్ భారత్ పార్టీ), దేవరశెట్టి రవీంద్రబాబు (ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి), పేరం శివ నాగేశ్వరరావు (రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే); బర్రె శ్రీనివాసరావు (జైభీమ్ శ్రీనివాస్)-తెలుగు రాజాధికార సమితి పార్టీ; సయ్యద్ ఖమురున్నీసా (నవరంగ్ కాంగ్రెస్ పార్టీ), అనిల్ కుమార్ మద్దినేని (స్వతంత్ర), అర్జున్ చెవిటి (స్వతంత్ర), చరణ్ సుజిత్ నంబూరు (స్వతంత్ర), దేవరపల్లి మల్లిఖార్జునరావు (మహేష్)-స్వతంత్ర; వెంకట అశోక్ పప్పూరి (స్వతంత్ర) ఉన్నారు.
నామినేషన్ల పరిశీలన ప్రక్రియను పరిశీలించిన అబ్జర్వర్లు:
జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు మంజూ రాజ్పాల్, నరేంద్ర సింగ్ బాలిలు పరిశీలించారు. నామినేషన్ పరిశీలన ప్రక్రియలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News