– సీఎం సహాయ నిధికి డాక్టర్ జి. శరత్ బాబు రూ. 5 లక్షల విరాళం
– వరద బాధితులైన తమ హాస్పిటల్ సిబ్బందికి రూ. 6 లక్షల సహాయం
– రూ. 5 లక్షల చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేసిన డాక్టర్ జి. శరత్ బాబు, డాక్టర్ జి. ప్రశాంతి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన బాధితులకు అండగా నిలిచింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి హాస్పిటల్ చైర్మన్, ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జి. శరత్ బాబు రూ. 5 లక్షల విరాళాన్ని అందజేశారు. డాక్టర్ జి. శరత్ బాబు, డాక్టర్ జి. ప్రశాంతి దంపతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ. 5 లక్షల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విజయ సూపర్ స్పెషాలిటీ అధినేత శరత్ బాబును సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందజేయడమే కాకుండా, తమ హాస్పిటల్ సిబ్బందిలో కొందరు వరద కారణంగా నష్టపోయినట్లు తెలుసుకున్న విజయ సూపర్ స్పెషాలిటీ యాజమాన్యం.. వారికి తక్షణం సాయమందించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న సిబ్బందికి రూ. 6 లక్షలతో సహాయ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ జి. శరత్ బాబు మాట్లాడుతూ, ప్రజారోగ్య సంరక్షణ కోసం తాము నిరంతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము అండగా నిలుస్తామని, వరద కారణంగా నష్టపోయిన తమ సిబ్బందికి అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తామని వెల్లడించారు. కష్ట కాలంలో తమకు చేయూతనందించిన హాస్పిటల్ యాజమాన్యానికి విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది ధన్యవాదాలు తెలియజేశారు.