-నూతన ఆలయ నిర్మాణం
-తొలి తిరునాళ్లు
-150 ఏళ్ల చరిత్ర
కానూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కానూరు తిరుపతమ్మ తిరునాళ్ళకు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యింది ఆలయం. ఏడాది క్రితం నూతనంగా మాజీ సర్పంచ్ దేవభక్తుని సుబ్బారావు నేతృత్వంలో నూతన ఆలయ పునః ప్రతిష్ట జరిగింది. ఈ ఆలయానికి 150 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో పెనుగ్రంచిప్రోలు అమ్మవారు తిరునాళ్లు తరువాత కానూరు గ్రామ తిరునాళ్లే రెండవ అతిపెద్ద తిరునాళ్లు నిర్వహించే ఆలయంగా చెప్పుకోవచ్చు. కానూరు గ్రామంలో 150 ఏళ్ల క్రితం పూర్వం దేవభక్తిని రంగయ్య, చెరుకూరి కోటయ్యలు వారికి కలలో అమ్మవారి దర్శన భాగ్యం కలగడం వలన ఆరోజుల్లో పిడకల గుడిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. శ్రీశ్రీతిరుపతమ్మ సమేత గోపయ్య విగ్రహాలను ప్రతిష్టించారు. అప్పటి నుండి తిరుపతమ్మ తిరునాళ్లు వైభవోపేతంగా సాగుతున్నాయి. గ్రామంలో పెరిగిన భక్తుల సంఖ్యకు అనుకూలంగా ఆలయ నిర్మాణాల్లో మార్పు వచ్చింది. మాజీ సర్పంచ్ స్వర్గీయ దేవభక్తుని వెంకటేశ్వరరావు పిడకల గూడులో ఉన్న విగ్రహాలను ఆలయ నిర్మాణం చేశారు. ఆ ఆలయం కూడా ఇటీవల కాలంలో బాగా కింది భాగంగా శిధిలమై పోవడం వల్ల నూతన ఆలయ నిర్మాణం చేపట్టారు. ఏడాది క్రితం పూర్తయింది. దీనికి మాజీ సర్పంచ్ దేవభక్తిని సుబ్బారావు బాధ్యత వహించారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులుగా ఉంటూ నిర్మాణాన్ని చేపట్టారు. తనతోపాటు దాతల సహకారంతో నిర్మాణం పూర్తి చేసి ఏడాదైంది. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 12వ తేదిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారిని నూతన పట్టు వస్త్రాలతో అలంకరిస్తారు. 13వ తేదీన అమ్మవారికి పొంగళ్ళు బోనాలతో తిరునాళ్ల ప్రారంభమవుతాయి. రాత్రికి శ్రీ గోపయ్య స్వామి తిరుపతమ్మ అమ్మవార్ల విగ్రహాలతో ప్రభోత్సవం అత్యంత వైభవోపేతంగా గ్రామ పురవీధుల్లో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కానూరు గ్రామంలో పూర్వీకులు, గ్రామ పెద్దలు, ప్రజలు, బంధువులు, స్నేహితులు, గ్రామంలోని కుటుంబాలన్నీ పిల్లాపాపలతో గ్రామ ప్రభోత్సవంలో పాల్గొంటారు. 20వ తేదీన పదివేల మందికి అన్న సమారాధన నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు పసుపులేటి సాయిబాబు, కార్యదర్శి చెరుకునీడు శివాజీ పర్యవేక్షిస్తారు.
Prajavartha Online Telugu News