-ఓట్లు, సీట్లు మాకు ముఖ్యం కాదు
-గిరిజనుల సంక్షేమమే మా ప్రభుత్వ ఆశయం
-2018లో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు రోడ్ల పరిస్థితి చూసి ఆవేదన చెందా
-మూడు నెలల క్రితం రోడ్ల అభివృద్ధికి మళ్లీ వస్తానన్న మాటతో “అడవితల్లి బాట”తో మీ ముందుకి వచ్చాను
-వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఏజెన్సీ అభివృద్ధి కోసం రూ. 92 కోట్లు ఖర్చు చేసింది
-కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే రూ. 1,005 కోట్లు మంజూరు చేసింది
-అడవితల్లి రుణం తీర్చుకోవడానికి ఏం చేయాలన్న ఆలోచనతోనే “అడవితల్లి బాట” కార్యక్రమం
-గిరిజన ప్రాంతాల యువత గంజాయి సాగు వీడి పర్యాటకం వైపు దృష్టి పెట్టండి
-గిరిజనులకు అండగా నిలబడే ప్రభుత్వం మాది
-అరకు నియోజకవర్గం, డుంబ్రీగూడలో “అడవితల్లి బాట” మొదటి దశ కార్యక్రమం ప్రారంభించి, ప్రసంగించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త
‘అడవినే నమ్ముకున్న గిరిపుత్రుల గురించి మనసుతో ఆలోచిస్తాం. వారి అభివృద్ధి, అభ్యున్నతి కోసం నిత్యం తపిస్తాం. మాకు ఓట్లు, సీట్లు ముఖ్యం కాదు. గిరి పుత్రుల సంపూర్ణ అభివృద్ధి, జీవనశైలి పెంపుదల ముఖ్యం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో గిరిజనుల అభివృద్ధికి రూ. 92 కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే రూ.1005 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కేవలం మాటలు చెప్పి శంకుస్థాపన ఫలకాలు వేసి వెళ్లిపోవడం కాదని, వారం రోజుల్లోనే పనులు మొదలయ్యేలా, సకాలంలో పనులు పూర్తయ్యేలా చూసే బాధ్యతను తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన గ్రామాల అనుసంధాన రోడ్లను నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టిన “అడవితల్లి బాట” కార్యక్రమాన్ని సోమవారం అరకు నియోజకవర్గం, డుంబ్రీగూడలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. రూ. 1,005 కోట్లతో గిరిజన గ్రామాలను కలుపుతూ నిర్మించబోతున్న 558 రోడ్లకు సంబంధించి మొదటి దశలో పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. అడవితల్లి బాట కార్యక్రమం గిరిజన గ్రామాల రూపురేఖలు మార్చే వరకు నిరంతరం కొనసాగనుంది.
ఈ కార్యక్రమానికి శంకుస్థాపన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “నేను మాటమీద నిలబడే మనిషిని. గిరిజనులు అంటే ఓట్లు.. సీట్లు అని ఎప్పుడూ చూడను. అడవి అంటే నాకు ప్రాణం. పచ్చని చెట్లను చూస్తే మనసు పులకిస్తుంది. అడవిని నమ్ముకుని బతికే గిరిబిడ్డల బతుకులను చూస్తే ఆవేదన కలుగుతుంది. 2018 పోరాట యాత్ర సమయంలో అరకులో వారం రోజుల పాటు పర్యటించాను. ఆ సమయంలో అడవి బిడ్డల కోసం ఏదైనా చేయాలని బలంగా సంకల్పించాను. వీరి వెతలు తీర్చేందుకు అధికారం ఉంటే బాగుంటుందని, గిరిపుత్రుల కోసం అధికారం ఇవ్వమని దేవుళ్లను కోరాను. అనుకున్నట్లే ప్రజలు బలమైన నమ్మకంతో 164 సీట్లు కూటమికి కట్టబెట్టి అధికారంలో నిలబెట్టారు. మీరు పెట్టిన ఈ పెద్ద బాధ్యతను అంతే శ్రద్దతో నిర్వర్తించాలని అనుక్షణం భావిస్తాను. మూడు నెలల క్రితం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించినప్పుడు రోడ్ల నిర్మాణం విషయంలో అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో వస్తానని మాటిచ్చాను. ఇప్పుడు అదే ప్రణాళికతో రూ. 1000 కోట్లకు పైబడి నిధులు తీసుకువచ్చి డోలీ మోతల రహిత ఏజెన్సీ సాకారానికి మీ ముందుకు వచ్చాను.
గత ప్రభుత్వం నిధులను అడ్డగోలుగా వాడేసింది
గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సరైన రోడ్లు ఉండాలి. గిరిజన గ్రామాలు మారుమూల ప్రాంతాల్లో తక్కువ మంది జనాభాతో ఉంటాయి. వాటిని అనుసంధించాలనే గొప్ప సంకల్పంతో గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన్ మన్ కార్యక్రమం తీసుకువచ్చింది. 500 జనాభా లోపు ఉన్న గ్రామాలకు కూడా అనుసంధాన రహదారులు వేయాలన్న గొప్ప సంకల్పానికి ప్రధాన మంత్రి జన్ మన్ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రభుత్వంలో నిధులు లేని సమయంలో కూడా గత ప్రభుత్వం ఉన్న నిధులను అడ్డగోలుగా వాడేశారు. లెక్కా పత్రం లేకుండా నిధులను పక్కదోవ పట్టించారు.
అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్లి నేను అడిగిన పని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో గిరిజనుల గ్రామాల అభివృద్ధికి రోడ్లు వేయాలని కోరాను. అడిగిన వెంటనే ముఖ్యమంత్రి రూ. 49 కోట్లు ఇవ్వడం చాలా సంతోషం కలిగించింది. అడవితల్లిబాటకు ముఖ్యమంత్రి చంద్రబాబు బలం ఇచ్చారు.
నేను ఓట్ల కోసమో.. రాజకీయం చేయడం కోసమో ఇక్కడికి రాలేదు. ఓట్ల కోసం రాజకీయం కోసం అయితే స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ పేర్లు చెప్పేవాడిని కాదు. పార్టీలు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. పార్టీల మధ్య వైరుధ్య భావాలు ఉండడం సహజం. అలా సిద్ధాంత బేధాలు ఉన్నంత మాత్రాన శత్రువులు అయిపోరు. ప్రజల అభివృద్ధి కోసం కూర్చుని మాట్లాడుకుంటే చాలా పనులు అవుతాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలోని 13,326 పంచాయతీలకు జాతీయ పండుగల నిర్వహణకు సంబంధించిన నిధులను పెంచాం. గత ప్రభుత్వంలో ఎన్నికయిన గ్రామాల సర్పంచులు అని చూడకుండా ఆ నిధులను మంచి కోసం వారికి అందించాం. ఇది మా చిత్తశుద్దికి నిదర్శనం. అరకు వస్తున్న సమయంలో చుట్టూ కొండలు, లోయలు, టేకు మొక్కలు, జీడి తోటలు,రిసార్టులు, గిరిజన గృహాలు, పచ్చదనం చిగురిస్తున్న అందాలు కనిపించాయి. అడివితల్లికి ఏదో చేయాలన్న ఆలోచన నుంచి పుట్టిన కార్యక్రమమే అడవితల్లి బాట కార్యక్రమం. అరకు ప్రాంతం ఒక అద్భుతం. టూరిజం పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి చెందాలి. దేశం మొత్తం అరకు వైపు చూసేలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. కూటమి ప్రభుత్వం అడవితల్లిబాటలో చేపట్టిన పనులు వారంలో ప్రారంభం అవుతాయి. అతి త్వరలో పూర్తవుతాయి. మారుమూల గిరిజన గ్రామాలను సైతం అనుసంధానం చేసేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో 2,605 గిరిజన ఆవాసాలు ఉంటే వాటిలో 1,177 ఆవాసాలకు రోడ్డు కనెక్టివిటీ లేదు. ప్రస్తుతం అడవితల్లిబాట కార్యక్రమంలో 1,069 ఆవాసాలకు రోడ్డు కనెక్టివిటీ చేస్తున్నాం. మిగిలిన గ్రామాలకు కూడా సమీపకాలంలో పూర్తి చేస్తాం.
మాకు తన మన బేధం లేదు
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా నిధులను ఖర్చు చేయడంలో బాధ్యతగా ఉంటాం. ఎక్కడ నిధులు ఖర్చు చేయాలి. ఎక్కడ లేదు అన్నది పూర్తిగా పరిశీలన చేశాకే ఖర్చు చేస్తాం. మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయం. ఓట్లు వేసిన వారు తరతమ బేధం కూటమి ప్రభుత్వానికి లేదు. మీరు మా వాళ్లు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. పెదపాడు గ్రామానికి వెళ్లిన తర్వాత అక్కడ ప్రజలు కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే వాటికి పరిష్కారంగా 12 పనులను మంజూరు చేశాం. అరకు ప్రాంతంలో యువత గంజాయి సాగు వైపు మళ్లవద్దు. గంజాయి తీసుకోవడానికి అలవాటు పడవద్దు. గంజాయ సమస్యను కూటమి ప్రభుత్వం సామాజిక, ఆర్ధిక సమస్యగా భావిస్తోంది. కక్ష సాధింపులు ఏ మాత్రం లేకుండా గంజాయి నిర్మూలనకు నడుం బిగించాం. గంజాయి సాగువల్ల నేరాల్లో ఇరుక్కుంటే, దాన్ని వాడడం వల్ల ఆరోగ్యం నష్టపోతారు. స్థానికంగా ఉన్న యువత పర్యాటకం వైపు దృష్టి సారించండి. దీనిలో అపార అవకాశాలు ఉన్నాయి. చాపరాయి దగ్గర బ్రిడ్జి కావాలని కోరారు. పర్యావరణ అనుకూల బ్రిడ్జిని ఇక్కడ నిర్మించాలి. దానికి ఒక చక్కటి పరిష్కారం వెతుకుదాం. నాకు సమయం ఇవ్వండి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతల కష్టం తప్పుతోంది. అనంతగిరి మండలం, పొలంగూడ గిరిజన గ్రామంలో బీటీ రోడ్డు వేయడంతో ఆ గిరిజన గ్రామంలో అంబులెన్స్ కూత మొదటి సారి వినిపించింది. ఈ అభివృద్ది కార్యక్రమాల వల్ల మా కూటమి ప్రభుత్వానికి డబ్బులు వస్తాయనో ఓట్లు వస్తాయనో కాదు. మీ కష్టం కూటమి ప్రభుత్వ కష్టంగా భావిస్తోంది. కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. ప్రజలతో మమేకమై తిరిగితే గిరిజనుల బాధలు, వేదనలు తెలుస్తాయి. నేను కూడా మా నాయకులకు అదే చెబుతాను.
కాఫీ తోటలు పెరగడం వల్ల ఉపాధి మెండుగా లభిస్తుంది
అరకు కాఫీ దేశానికి ప్రసిద్ధి. ప్రస్తుతం అరకులో కాఫీ తోటలు 2.25 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు పెంచేందుకు, ఎత్తయిన ప్రాంతాల్లో ఉద్యానవనాలు పెంచేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి సాయం చేయాలని కలెక్టర్ కోరారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి వెంటనే పనులను చేసేందుకు అనుమతులు ఇచ్చేలా ప్రయత్నిస్తాం. ఏ మాత్రం అవకాశం ఉన్నా అరకు ప్రాంతంలో కాఫీ తోటల పెంపుదలకు ప్రోత్సాహం ఇస్తాం. కాఫీ ఉత్పత్తుల సాగు పెరిగితే స్థానిక యువతకు ఉపాధి మెండుగా లభిస్తుంది. దీనివల్ల అరకు ప్రాంతంలో ప్రజల జీవన శైలి మెరుగవుతుంది. కలెక్టర్ గారు ఇచ్చిన సూచనపై దృష్టి సారిస్తాం.
మూఢ నమ్మకాలు వద్దు.. అడవులను కాపాడండి
ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లో చేతబడి, చిల్లంగి వంటి మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నట్టు పోలీసుల చెబుతున్నారు. మూఢ నమ్మకాలతో ఇటీవల 9 మందిని హత్య చేసినట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఈ కాలంలోనూ మూఢ నమ్మకాలు నమ్మడం సహేతుకం కాదు. మన మనసులో మంచి ఉంటే సాధించాలన్న బలమైన సంకల్పం ఉంటే మనల్ని ఎవరూ అడ్డుకోలేరు. నన్ను అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వం అన్న వాళ్లే ఇఫ్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోతున్నారు. మనసులో మంచి ఉంటే ఎదుటి వాళ్లు చెడు చేసినా మన సంకల్ప బలం మనల్ని కాపాడుతుంది. మనసుకు మెదడుకు మించిన శక్తి మరోకటి లేదు. ఒక మంచిని బలంగా కోరుకుంటే ఖచ్చితంగా అవుతుంది. మూఢ నమ్మకాల వైపు మళ్లవద్దు. పోలీసులు దీనిపై చైతన్యం నింపేలా వికాస్ అనే కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. చట్టాలను చేతులోకి తీసుకోవద్దు. అడవులపై కూడా నిర్లక్ష్యం వీడండి. సిగిరెట్లు తాగి నిర్లక్ష్యంగా పడవేయడం. అడవుల్లో చిన్న చిన్న మంటలు పెట్టడం వంటిపనులు చేయొద్దు. దీని వల్ల పెను నష్టం జరుగుతుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ కార్చిచ్చు ఎంతటి విపత్తుని మిగిల్చిందో చూశాం అడవుల్లో కార్చిచ్చుల వల్ల మూగ జీవాలు యాతన అనుభవిస్తాయి.
బంగారు భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం అవసరం
ప్రజల మనసులు గెలుచుకోవాలంటే వారికి వారి అవసరాలు, సౌకర్యాలు, వసతులు తీర్చే ప్రభుత్వం కావాలి. అలాంటి ప్రయత్నమే కూటమి ప్రభుత్వం చేస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి మన్యం ప్రాంతంలో కూటమి ప్రభుత్వ పతాకాలు రెపరెపలాడాలి. మేము ఓట్ల కోసం ఏ పని చేయడం లేదు. కానీ మేము చేసిన అభివృద్ధి, గిరిజనుల కోసం పడే తపనే మమ్మల్ని ఏజెన్సీ ప్రాంతంలో నిలబెడుతుంది. రాష్ట్రంలో 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉండాలి. అప్పుడే విభజన గాయల నుంచి, గత ప్రభుత్వం ఏర్పరిచిన దెబ్బల నుంచి బయటపడగలం. దీనికి ప్రజల ఆశీస్సులు కావాలి. చిన్నాభిన్నం అయిన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు చక్కదిద్దుతున్నారు. నేను ఎల్లపుడూ మీ మధ్యనే ఉంటూ మీ కష్టాలు వింటూ మీతోనే నడుస్తాను. రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అవసరం” అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఇంఛార్జ్ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దార్, ఆర్జీసీ రీజనల్ ఛైర్మన్ దొన్ను దొర పాల్గొన్నారు.
అడవితల్లి బాట మొదటి దశ కార్యక్రమం వివరాలు
ప్రధాన మంత్రి జన్ మన్ పథకం
(206 రహదారులు, 612.72 కిలోమీటర్ల మేర రోడ్లు, 239 అనుసంధాన గ్రామాలు, రూ. 555.61 కోట్ల నిధులు)
-మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (343 రోడ్లు, 367 అనుసంధాన గ్రామాలు, 471.63 కిలోమీటర్ల రోడ్లు, రూ. 399.66 కోట్ల నిధులు)
-రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నిధులు
(9 రోడ్లు, 19 అనుసంధాన పంచాయతీలు, 48.85 కిలోమీటర్ల మేర రోడ్లు, రూ. 49.73 కోట్ల నిధులు)