-ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల భవిష్యత్ పై తీవ్ర దుష్పృభావం..
-ఈ- వేస్ట్ సేకరణను ఉద్యమంగా చేపడదాం..కాలుష్యాన్ని నివారిద్దాం..
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
-ఎంఎల్ఎ గద్దె రామ్మోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ- వేస్ట్ ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల తీవ్రమైన అనర్థాలు పొంచి ఉన్నాయని భవిష్యత్ పై తీవ్ర దుష్పృభావం చూపనున్న ఈ వ్యర్థాల సేకరణను ఉద్యమంగా చేపట్టి వ్యర్థాలను రీసైకిలింగ్ చేయడం ద్వారా విలువైన లోహాల వృదాలను అరికట్టడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బెంజ్సర్కిల్ సమీపంలోని నారా చంద్రబాబు కాలనీలో ఏర్పాటు చేసిన ఈ – వ్యర్థాల ప్రత్యేక నిర్వహణ (స్పెషల్ డ్రైవ్) కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ శాసనసభ్యులు గద్దెరామ్మోహన్, విఎంసి కమీషనర్ ధ్యాన చంద్రలు ముఖ్య అతిధిగా హాజరై స్థానిక ప్రజల నుండి ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాలుష్య రక్షితంగా తీర్చిదిద్ధాలన్న దృడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ప్రతి నెల ఒక థీమ్తో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా ఈనెల ఈ వ్యర్థాల సేకరణ ప్రత్యేక డ్రైవ్గా చేపట్టిన్నట్లు తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కంప్యూటర్, లాప్ టాప్, ప్రింటర్, ఫాక్స్, సెల్ఫోన్, లాండ్ ఫోన్, ఛార్జర్, మైక్రోవేవ్, ఎలక్ట్రికల్ కుక్కర్, టీవి, డివిడి, రిమోట్, స్టీరియో టేప్ రికార్డర్, ఎసిలు, వాషింగ్ మిషన్లు, ఫాన్, పాత మోటార్లు, కరెంట్ వైర్లు, వాటర్ హీటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం నానాటికి పెరుగుతుందన్నారు. దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరూ ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగించనిదే ఒక్క క్షణం కూడా గడవని పరిస్థితి ఉందన్నారు. కేవలం విజయవాడ నగరంలో ప్రతి రోజు 700 కేజీ ల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ప్రజలు పారవేస్తున్నట్లు వెల్లడవుతుందన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులలో ఉండే లెడ్, కాడ్మియం, మెర్కూరీ, బెరీలియం వంటి మూలకాలు అతి ప్రమాదకరమైనవని తెలిపారు. పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రజలు బహిరంగ ప్రదేశాలలో వ్యర్థ పదార్థాలతో కలిపి పారవేయడం వల్ల రసాయన పదార్థాలు భూమి, నీరు, గాలిలో కలవడం వలన తీవ్ర కాలుష్యమౌతున్నాయన్నారు. తద్వారా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపి కాన్సర్, గుండె జబ్బు, ఊపిరితిత్తుల వంటి అనేక వ్యాధులతో పాటు తల్లి పాలు కూడా కలుషితం అయ్యే ప్రమాదం ఉందన్నారు. చిన్న ఆలోచన సమాజంలో పెను మార్పులకు దారి తీస్తుందన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో ఉండే రసాయన పదార్థాల వలన కలిగే అనర్థ్థాలపై అవగాహన కలిగి నిరుపయోగమైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర ద్వారా ప్రభుత్వం చేపట్టిన ఈ – వ్యర్థాల సేకరణకు అందించి కాలుష్యరహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ప్రజలకు పిలుపునిచ్చారు.
విజయవాడ తూర్పు నియోజక వర్గ శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న నగర ప్రాంతాలలో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం అధికంగా ఉంటుందన్నారు. నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించేందుకు కలక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ- వ్యర్థాలను రిసైకిలింగ్ చేయడం ద్వారా సేకరించిన మినరల్స్ కెమికల్స్ ద్వారా కోట్లాధి రూపాయలు ఆదాయం సమకూర్చుకోవచ్చునని తద్వారా ఆర్థికాభివృద్ధి దోహదపడుతుందన్నారు.
నగర పాలక సంస్థ కమీషనర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర ద్వారా నగరాన్ని సుందరనగరంగా తీర్చిదిదేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు ఉద్యోగుల భాగస్వామ్యంతో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించి మలేరియా, డెంగ్యూ ఆంటు వ్యాధుల నివారణకు కృషి చేస్తున్నామన్నారు. ఈ వ్యర్థాల ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా నగర వ్యాప్తంగా అన్ని వార్డుల పరిధిలో ఈ వ్యర్థాలను సేకరించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
అనంతరం స్థానిక ప్రజల నుండి ఈ వ్యర్థాలను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, శాసన సభ్యులు గద్దె రామ్మోహన్, మున్సిపల్ కమీషనర్ ధ్యాన చంద్ర సేకరించారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొంటామని పచ్చదనం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తామని ఈ వ్యర్థాల సేకరణలో భాగస్వామ్యులవుతామని కాలుష్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో తన వంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేయించి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ చంద్రశేఖర్, స్థానిక కార్పోరేటర్ చెన్నుపాటి క్రాంతిశ్రీ, నగరపాలక సంస్థ జోనల్ కమీషనర్ కె. షమ్మీ, ఇన్చార్జి ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ గోపాల కృష్ణ నాయక్, స్థానిక నాయకులు చెన్నుపాటి గాంధీ, నారా చంద్రబాబు కాలనీ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News