ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఇంద్రకీలాద్రి ప్రత్యేక కుంకుమార్చన మంటపంలో మంగళవారం జరిగిన చతుర్వేద పారాయణ సభ వీనుల విందుగా సాగింది. బ్రహ్మశ్రీ చింతపల్లి ఆంజనేయ ఘనపాటి అధ్యక్షతన జరిగిన ఈ పండిత సన్మాన సభకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 450 మంది వేద పండితులు, వేద విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన దుర్గగుడి ఈవో శీన నాయక్ మాట్లాడుతూ… గత 50 సంవత్సరాలుగా దసరా మహోత్సవాలలో చతుర్వేద పారాయణ సభ జరుగుతోందని చెప్పారు. వివిధ దేవస్థానాల నుంచి వేద పండితులు ఒకచోటకు రావటం వల్ల వివిధ అంశాల గురించి చర్చించే అవకాశం లభిస్తుంది అన్నారు. గత సంవత్సరం కంటే ఎక్కువమందికి పారితోషికం అందిస్తున్నట్లు తెలిపారు. ఆరు వేల రూపాయలు చొప్పున 120 మంది ఘనపాటి లకు, అయిదు వేల రూపాయల చొప్పున 302 మంది క్రమపాటిలకు, నాలుగువేల రూపాయల చొప్పున 28 మంది ఆహితజ్ఞులకు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న దుర్గగుడి చైర్మన్ గా నియమితులైన బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మాట్లాడుతూ… సంస్కృతి పరిరక్షణలో వేద పండితుల పాత్ర కీలకమన్నారు. కార్యక్రమంలో కాణిపాకం దేవస్థానం కార్య నిర్వహణ అధికారి పి. కిషోర్ కూడా పాల్గొన్నారు. 450 మంది పండితులు ఒకే గొంతుకతో చేసిన ఋగ్వేద, యజుర్వేద,సామవేద పఠన ఆకట్టుకుంది.
Prajavartha Online Telugu News