-మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై డీఎంకే తీరును ఎండగట్టిన ముఖ్యమంత్రి
-ఏపీని ఉదాహరణగా చూపుతూ ఎన్డీఏతోనే అభివృద్ధి సాధ్యమని తమిళనాడులో ఎన్నికల ప్రచారం
-కర్ణాటక-తమిళనాడు వివాదాలకు చెక్ పెట్టేలా గంగా-కావేరి అనుసంధానంపై ప్రస్తావన
-తమిళనాడు పునర్ వైభవం ఎన్డీఏతోనే సాధ్యమంటూ సభల్లో స్పష్టంగా చెప్పిన ఏపీ సీఎం
తమిళనాడు, నేటి పత్రిక ప్రజావార్త :
తమిళనాడులో రెండు రోజుల పాటు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్తో పలు కీలక ప్రాంతాలను ఎన్డీఏ తరపున ప్రచారం చేశారు. సోమ, మంగళవారాల్లో కోయంబత్తూర్, కృష్ణగిరి, విరుద్ నగర్, మధురై, చెన్నై జిల్లాల్లో పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలు, రోడ్ షోలు, స్థానిక వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు కూడగట్టారు. కోయంబత్తూర్ నార్త్, కోయంబత్తూర్ సౌత్, సింగనల్లూర్, కౌండం పాలాయం, సూలూర్, థలి, అన్నా నగర్, టీ నగర్, విల్లివాక్కం, సాత్తూర్, కోవెల్పట్టి నియోజకవర్గాల ఎన్డీఏ అభ్యర్థులు ఏపీ సీఎం నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నారు.
ఈ ప్రచారంలో ముఖ్యంగా అభివృద్ధిలో తమిళనాడు వెనుకబాటు, అవినీతి, క్షీణించిన శాంతి భద్రతలు వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు. అలాగే తమిళనాడుకు ఎన్డీఏ అవసరాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధిస్తున్నామని, అదే విధంగా ఎన్డీఏకు అవకాశం ఇస్తే తమిళనాడు కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి ఆయా సభల్లో వివరించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్ సహా వివిధ ప్రముఖ కంపెనీల నుంచి వచ్చే పెట్టుబడులకు కేంద్రం ఇస్తున్న చేయూతే కారణమని ముఖ్యమంత్రి వివరించారు. తమిళనాడుకు పునర్ వైభవం రావాలంటే ఎన్డీఏకే సాధ్యమవుతుందని ప్రతీసభలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య నిత్యం ఉండే నీటి తగాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే నదుల అనుసంధానమే మార్గమనే అంశాన్ని ఏపీ సీఎం వివరించారు. దీనికి గంగా-కావేరి నదుల అనుసంధానమే మార్గమని… ఇది జరగాలంటే ఎన్డీఏకు ఓటేయాలని కోరారు. తమిళనాడులో ఎన్డీఏ అధికారంలోకి వస్తే.. అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టవచ్చని… అలాగే చాలా సమస్యలకు శాశ్వత పరిష్కారం కూడా లభిస్తుందని సీఎం వివిధ సభల్లో వివరించారు. ఇక చెన్నైకు తెలుగు గంగ ప్రాజెక్ట్ ద్వారా తాగునీటి సరఫరా వంటి అంశాలను గుర్తుచేస్తూ రెండు రాష్ట్రాల మధ్య సహకారాన్ని ప్రస్తావించారు. అన్నదమ్ముల్లా కలిసి ఉందామని… కలిసి అభివృద్ధి చెందుదామని సీఎం చంద్రబాబు చెప్పారు. అలాగే తెలుగు-తమిళ ప్రజల అనుబంధం, ఎన్టీఆర్-ఎంజీఆర్ స్నేహం, దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని సీఎం చంద్రబాబు ప్రచార సభల్లో వివరించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్ అంశాలపై డీఎంకే వైఖరిని తీవ్రంగా విమర్శించిన ఏపీ సీఎం… మహిళలకు అన్యాయం చేసిన పార్టీలను ప్రజలు తిరస్కరించాలన్నారు. మహిళలను ఓడించిన డీఎంకేను ఓడించాలంటూ తమిళ ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇక డిలిమిటేషన్ ప్రక్రియలో జనాభాతో సంబంధం లేకుండా 50 శాతం సీట్ల పెంచుతామన్న కేంద్ర ప్రతిపాదనను తమిళులకు అర్థమయ్యేలా వివరించారు. జనాభా ఆధారంగా జరిగే డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు కలిగే నష్టాన్ని కూడా వివరిస్తూ మాట్లాడారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీల విధానాల వల్ల మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లిందని ప్రతి సభలోనూ సీఎం ప్రస్తావించారు. ప్రతి సభలోనూ తమిళంలో మాట్లాడి ప్రజలను ఆకట్టుకున్న సీఎం చంద్రబాబు…. స్థానిక భావోద్వేగాలను గౌరవిస్తూ ప్రచారం నిర్వహించారు.
Prajavartha Online Telugu News