-గతంలో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా, మరో ఐదేళ్ళు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్క సెంటు అయినా కొని ఇళ్లస్థలం ఇచ్చాడా?
-అక్కచెల్లెమ్మల మోముల్లో చిరునవ్వులు చూడటమే లక్ష్యం.
-రాబోయే రెండు దశాబ్దాలుగా సీఎంగా జగనన్నే ఉంటారు.
-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడి.
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద మైలవరం నియోజకవర్గంలో 5వేల ఇంటి నిర్మాణాలు పూర్తి చేసినట్టు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. మైలవరం మండలంలోని చంద్రాల గ్రామంలో ఆయన గురువారం వైఎస్సార్ జగనన్న కాలనీ ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో 23 వేలకు పైగా పక్కాగృహాలు మంజూరైనట్లు వెల్లడించారు. వీటిలో దాదాపు 5వేల గృహాల నిర్మాణం పూర్తి కాగా మిగతా ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నట్లు వెల్లడించారు. పేదల ఇంటి నిర్మాణాలకు సంబంధించి ఇప్పటివరకు రూ.107.84 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. సీఎం జగనన్న పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా, మరో ఐదేళ్ళు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్క సెంటు అయినా కొని ఇళ్లస్థలం ఇచ్చాడా? అని ప్రశ్నించారు. తాను మోసిన జెండా, తాను నమ్మిన నాయకుడు సీఎం జగనన్న నాయకత్వంలో రికార్డు స్థాయిలో పేదలకు ఇళ్ళు, ఇళ్లస్థలాలు ఇచ్చామన్నారు. అక్కచెల్లెమ్మల మోముల్లో చిరునవ్వులు చూడటమే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. పేదల సొంతింటి కల సాకారం చేస్తున్నాం అనడానికి సజీవ సాక్ష్యమే చంద్రాల వైయస్సార్ జగనన్న కాలనీ అని పేర్కొన్నారు. ఇక్కడ 160 మందికి ఇళ్లస్థలాలు, పక్కాగృహాలు మంజూరు చేయగా 63 మంది తాజాగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్నారని వెల్లడించారు. ఇంకా ఎవరైనా అర్హులైన వారు ఉంటే వారికి కూడా ఇళ్లస్థలాలు ఇస్తామన్నారు. పేదల ఇంటి నిర్మాణాలపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. దీన్ని తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాడు నేడు, జగనన్న సురక్ష, విద్య, వైద్యం, అన్ని రంగాల్లో సీఎం జగనన్న ముద్ర కనిపిస్తోందన్నారు. విశాల దృక్పథంతో సీఎం జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాబోయే రెండు దశాబ్దాలు సీఎం జగనన్న ముఖ్యమంత్రిగా ఏపీని పాలించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News