-విద్యుత్ వినియోగంలో పొదుపు రేపటి వెలుగుల సాకారం
-జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ ను పొదుపుగా వినియోగించడం పై వినియోగదారుల్లో, గృహాల్లో , పరిశ్రమల్లో, వ్యాపార సముదాయాల్లో ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించాల్సి ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ పేర్కొన్నారు.
బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ది.14.12.2023 నుండి ది.20.12.2023 వరకు నిర్వహించనున్న జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలును జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం గోడ ప్రతిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, విద్యుత్ వినియోగించు కోవడంలో పొదుపు చర్యలు తప్పనిసరిగా పాటించాలని, తద్వారా భవిష్యత్ తరాలకు బొగ్గు, గ్యాస్, క్రూడ్ ఆయిల్ వంటి శిలాజ ఇంధనాలు వినియోగం తగ్గించి రేపటి తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా చేయుటకు ఇంధన వనరుల మీద అత్యంత శ్రద్ద కనబరుస్తోందని ఆమేరకు యువత, ముఖ్యంగా విద్యార్థులను ఇటువంటి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలన్నారు. .విద్యుత్ వినియోగం బాగా పెరగడం వలన, సహజ వనరుల పరిరక్షణ కొరకు మరియు గ్లోబల్ వార్మింగ్ ను నియంత్రించుటకు విద్యుత్ ను పొదుపు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా వుందన్నారు. విద్యుత్ సరఫరా చేయడానికి, జీవన ప్రమాణాలను అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం ఒక మహోద్యమంలా విద్యుత్ పొదుపును అమలు చేయటానికి కంకణం కట్టుకుందని , మనందరం ఇందులో భాగస్వామ్యం అవుదామన్నారు.
విద్యుత్ ను పొదుపుగా ఉపయోగించడం వలన సహజ వనరులను ఎక్కువ కాలం ఉపయోగించుకొనవచ్చును మరియు ముందు తరాలకు ఉపయోగపడతాయి. విద్యుత్ ను పొదుపుగా వినియోగించడానికి పర్యవేక్షక ఇంజనీర్,ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవరం టి.వి.ఎస్.ఎన్. మూర్తి మాట్లాడుతూ, విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా తొలిరోజు 14.12.2023 విద్యుత్ పొదుపు ర్యాలీని ప్రారంభించామన్నారు . డిసెంబర్ 15 న “విద్యుత్ పొదుపు-ప్రాముఖ్యత” పై స్వయం సహాయక సంఘాలతో మరియు మహిళలతో వర్క్ షాప్ మరియు అవగాహనా సదస్సులు, ప్రతి సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్ నందు స్కూల్ విద్యార్ధిని, విద్యార్ధులకు పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 16న ఇంజనీరింగ్ కాలేజిల యందు “విద్యుత్ పొదుపు యొక్క ఆవశ్యకత మరియు అధునాతన పద్ధతులు” పై నిష్టాతునల సందేశం, డిసెంబర్ 17న “విద్యుత్ పొదుపు యొక్క ఆవశ్యకత” గురించి ప్రతి డివిజన్ హెడ్ క్వార్టర్ నందు స్కూల్ విద్యార్ధినీ, విద్యార్ధులకు వ్యాస రచన మరియు వకృత్వ పోటీలు, డిసెంబర్ 18 న విద్యుత్ పొదుపు సూచనల కరపత్రాలను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ శాఖలకు అంద జేయుట మరియు విద్యుత్ పొదుపు కు సంబంధించిన హోర్డింగులు ఏర్పాటు, డిసెంబర్ 19 న విద్యుత్ పొదుపుపై అవగాహన కొరకు గ్రామీణ ప్రాంతములలో జానపద కళాకారులు మరియు జన విజ్ఞాన వేధిక కార్యకర్తలతో ప్రదర్శనలు ఏర్పాటు చేయుట జరుగును. డిసెంబర్ 20 న విద్యుత్ పొదుపు వారోత్సవాల ముగింపు కార్యక్రమం మరియు బహుమతులు ప్రదానం చెయ్యడం జరుగుతుందని అన్నారు. పూర్వపు తూర్పు గోదావరి జిల్లా లోని అన్ని ఆపరేషన్ డివిజనల్ కార్యాలయము నందు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం లో ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, రాజమహేంద్రవరం ఆపెరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ టి.వి.ఎస్.ఎన్. మూర్తి, ఈ ఈ లు బి.. వీరభద్ర రావు , డి. శ్రీధర వర్మ, ఎన్. శ్యాముల్, డి ఈ ఈ ఎస్. దేవయ్య, టి. గ్రాబియల్, సహాయ ఇంజనీర్లు, లైన్ మెన్స్, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News