Breaking News

మిషన్‌ లైఫ్‌లోనూ ఆంధ్రప్రదేశ్‌ ‘లీడర్‌’

-ఇంధన సామర్థ్యం, పర్యావరణ పరిరక్షణలో ట్రెండ్‌ సెట్టర్‌గా మారుతాం
-జీవన ప్రమాణాలు పెంపొందించడంలో నంబర్‌ వన్‌గా నిలిచేందుకు కృషి
-స్థిరమైన జీవన ప్రమాణాలు, ఇంధన భద్రతని ప్రోత్సహించేలా మిషన్‌ లైఫ్‌
-పునరుత్పాదక ఇంధనవనరులు, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణహిత పర్యాటక రంగం,
-ఇంధన సామర్థ్యంలో ఉపాధి అవకాశాలు సృష్టిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధి
-స్థానికంగా ఉపాధి అవకాశాలు, ఆర్థిక వృద్ధికి మిషన్‌లైఫ్‌ తోడ్పాటు
-ఏపీలోని ప్రతి ప్రాంతానికి మిషన్‌లైఫ్‌ చేరుకోవడం లక్ష్యం
-అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రజలకు 24/7 నాణ్యమైన
-విద్యుత్‌ సరఫరా చెయ్యడమే సీఎం చంద్రబాబు ప్రధాన లక్ష్యం
-2014 నుంచి ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు ఏపీ మార్గదర్శకత్వం వహించింది
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సుస్థిర జీవన ప్రమాణాలు పెంపొందించడంతో పాటు ఇంధన సామర్థ్యంలో సరికొత్త కొత్త ప్రమాణాలను నెలకొల్పేందుకు భారత ప్రభుత్వ విద్యుత్‌ మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) అమలు చేస్తున్న మిషన్‌ లైఫ్‌ కార్యక్రమంతో ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మక మిషన్‌ స్థిరమైన జీవన విధానాలను పెంపొందించడం, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం, ఇంధన భద్రతను నిర్ధారించడం మరియు ప్రజల మొత్తం జీవన నాణ్యతని పెంపొందించేందుకు సిద్ధమవుతోంది. మిషన్‌ లైఫ్‌ అమలులో దేశంలోనే ట్రెండ్‌ సెట్‌ చేసే దిశగా ఏపీ మార్గదర్శిగా మారనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. బీఈఈ, విద్యుత్‌మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం తరఫున ఏపీలో మిషన్‌ లైఫ్‌ అమలు చేసేందుకు అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతులపై సమగ్ర నివేదికని బీఈఈ దక్షిణాది రాష్ట్రాలు, యూటీ మీడియా అడ్వైజర్‌ ఎ.చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి సీఎస్‌ నీరభ్‌కుమార్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఇంధన శాఖ కార్యదర్శి కె.విజయానంద్‌ సహకారం అందించారు.

మిషన్‌లైఫ్‌కు రాష్ట్రాలకు సారధిగా ఏపీ..
పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మిషన్‌ లైఫ్‌ కార్యక్రమం అమలులో అన్ని రాష్ట్రాలకు సారధ్యం వహించేందుకు ఆం«ధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ పునరుద్ఘాటించారు. ప్రపంచానికి ఎంతో అవసరమైన, అత్యంత కీలకమైన మిషన్‌ను ముందుకు తీసుకెళ్లడానికి బీఈఈ, కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు నిరంతరం మద్దతునందించేందుకు ఆసక్తిగా ఉన్నామన్నారు. విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దూరదృష్టితో కూడిన నాయకత్వంలో గ్రీన్‌ ఎనర్జీలో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించిందని తెలిపారు. 2014 అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా మొట్టమొదటిసారిగా ఉజాలా స్కీమ్‌ ద్వారా రికార్డు స్థాయిలో 2 కోట్ల ఎల్‌ఈడీ వీధిదీపాల్ని అతి తక్కువ ధరకు అందించే కార్యక్రమానికి ఏపీలో శ్రీకారం చుట్టారు. అనంతరం.. విశాఖలో ఎల్‌ఈడీ వీధిదీపాలు, ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించే వ్యవసాయ పంపుసెట్స్, ఈ.మొబిలిటీ లెర్నింగ్‌ మొదలైన ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టారన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో వరల్డ్‌ బ్యాంక్‌ ఎనర్జీ ఎఫిషియన్సీలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయాన్ని ప్రధాన కార్యదర్శి హైలైట్‌ చేశారు. ఆ సమయంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన పెట్టుబడులు సదస్సులు, పారిశ్రామిక సదస్సుల్లో ఏపీ నంబర్‌ వన్‌ ర్యాకింగ్‌ సాధించే విషయం ప్రధాన చర్చనీయాంశంగా మారిందని సీఎస్‌ వివరించారు. మిషన్‌లైఫ్‌ ఈ ప్రయత్నాలన్నింటినీ మరింత ముందుకు తీసుకెళ్తుందనీ.. సుస్థిర అభ్యాసాల్ని ప్రోత్సహిస్తూ.. ఇంధన వనరుల పరిరక్షణలో రాష్ట్ర నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని నీరభ్‌కుమార్‌ అన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యుత్‌..
అంతర్జాతీయ ప్రమాణాలతో 24/్ఠ7 నాణ్యమైన విద్యుత్‌ సరఫరాను అందించడంలో, ఆర్థిక వృద్ధికి దోహదపడుతూ… జీవన ప్రమాణాలను పెంపొందించే ఇంధన భద్రతకు భరోసా కల్పించడంలో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్‌ 1గా నిలపడమే సీఎం చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మక లక్ష్యమని నొక్కి వక్కాణించారు. ఇది దేశంలోని మిగిలిన వారు అనుసరించడానికి ఒక బెంచ్‌మార్క్‌ను సెట్‌ చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల అమరావతిలో మిషన్‌ లైఫ్‌ పోస్టర్‌ను విడుదల చేయడం కొత్త ఒరవడికి సంకేతాన్నిచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, బీఈఈ మధ్య ఈ సహకారం.. ఆరోగ్యకరమైన, మరింత సుస్థిరమైన రాష్ట్రం వైపు నడిపిస్తూ.. దేశంలోని అన్ని ప్రాంతాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆదాయం.. ఉపాధి..జీవ వైవిధ్యం..
‘ప్రకృతి రక్షిత.. రక్షితః..’ అనే సూత్రం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ఈ మిషన్‌ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి మూలకు చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందని ఇంధన శాఖ స్పెషల్‌ సీఎస్‌ విజయానంద్‌ అన్నారు. ప్రకృతిని రక్షించే వారిని.. ప్రకృతే సంరక్షిస్తుందనీ.. అదేవిధంగా.. మిషన్‌లైఫ్‌ కార్యక్రమాలు ఆరోగ్యం, ఆర్థిక, పర్యావరణ పరిస్థితుల్ని మెరుగుపరుస్తూ జీవన ప్రమాణాలు గణనీయంగా పెంచేందుకు దోహదపడతాయన్నారు. ప్రజల దైనందిక జీవితంలో పర్యావరణ అనుకూల పద్ధతుల్ని అవలంబించేలా ప్రోత్సహిస్తోంది. సమష్టిగా గణనీయమైన వాతావరణ మార్పులు, గ్లోబల్‌ వార్మింగ్‌ ముప్పు నుంచి విశ్వాన్ని రక్షించేలా సహకరిస్తుంది. పునరుత్పాదక ఇంధన వనరులు, వ్యర్థాల నిర్వహణ, ఇంధన సామర్థ్యం, పర్యావరణ పర్యాటకం తదితర రంగాలలో ఉద్యోగాలను సృష్టించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుంది. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంపొందించడమే కాకుండా.. ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది. స్థిరమైన అభ్యాసాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, సర్వీసులకు డిమాండ్‌ పెరుగుతుంది. చిన్న వ్యాపారాలు, స్థానిక మార్కెట్‌లకు సంపూర్ణ మద్దతుని అందిస్తుంది. అదనంగా, మిషన్‌ గ్రీన్‌ టెక్నాలజీల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడమే కాకుండా.. స్థానిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లకు సహాయం చేస్తుంది. మిషన్‌ లైఫ్‌ ద్వారా నడిచే ఎకో–కాన్షియస్‌ టూరిజం సహజ వనరులు, జీవవైవిధ్యాన్ని కాపాడుతూ స్థానిక కమ్యూనిటీలకు ఆదాయాన్ని కూడా పెంచనుంది.

చిన్న మార్పులు.. గొప్ప లక్ష్యాలు..
దైనందిక జీవితంలో.. మిషన్‌లైఫ్‌ సూచించిన చిన్న చిన్న మార్పులు చేస్తే.. గొప్ప గొప్ప లక్ష్యాలకు చేరువకానున్నామని బీఈఈ దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల .మీడియా సలహాదారు ఎ.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వ్యక్తులు, సంఘాలు, సంస్థలు సులభంగా అమలు చేసేలా 75 వ్యక్తిగత చర్యలను మిషన్‌ లైఫ్‌ వివరిస్తోందని అన్నారు.. ఎల్‌ఈడీ బల్బులను ఉపయోగించడం, ప్రజా రవాణా, స్వల్ప దూర ప్రయాణాలకు సైకిళ్లు, సీఎన్‌జీ, ఈవీ వాహనాలు, కార్‌పూలింగ్‌ తదితర పద్ధతులు వినియోగించడం, సోలార్‌ విద్యుత్‌ వినియోగం.. ఇలాంటి ఎన్నో పద్ధతుల్ని పాటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ని మరింత సుస్థిర, సుసంపన్న భవిష్యత్తు భరోసానిచ్చే రాష్ట్రంగా నిర్మించుకోగలమని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, బీఈఈ మధ్య ఈ సహకారం పచ్చదనం, ఆరోగ్యకరమైన, మరింత స్థిరమైన రాష్ట్రం వైపు ఒక ముఖ్యమైన అడుగు వేసినట్లని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఏపీఎస్‌ఈసీఎం సీఈవో కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. వాతావరణ మార్పులను పరిష్కరించడంలో భావి తరాలకు పర్యావరణహిత ప్రపంచాన్ని అందించవచ్చని తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *