గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థకు చెందిన వాహనాలు అన్నీ కండీషన్ లో ఉండాలని, వాహనాల స్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ స్థానిక కెవిపి కాలనీలోని నగరపాలక సంస్థ వెహికిల్ షెడ్ ని, ఏటుకూరు రోడ్ లోని కంపోస్ట్ యార్డ్, వర్మి కంపోస్ట్ యూనిట్ లను, చుట్టగుంట జంక్షన్, జిటి రోడ్, శ్రీనివాసరావుతోట తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత వెహికిల్ షెడ్ ని పరిశీలించి, ప్రస్తుతం ఉన్న వాహనాలు, వాటిలో మరమత్తులకు గురైనవాటి, వినియోగంలో లేని వాహనాల వివరాలు అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ ప్రతి వాహనం కండీషన్ లో ఉండేలా షెడ్ పర్యవేక్షణ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మరమత్తులకు గురైన వాహనాలను వెంటనే మరమత్తు చేసేలా కార్యాచరణ ఉండాలని, షెడ్ లోని వాహనాల స్థితి పై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలాగే ప్రతి వాహనంకు జిపిఎస్ ఉండాలన్నారు. ఏటుకూరు రోడ్ లోని కంపోస్ట్ యార్డ్ ని పరిశీలించి, నగరంలో నుండి వచ్చిన చెత్తను డంప్ చేయడం జరుగుతుందని యార్డ్ లో కన్వేయర్ బెల్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఏఈని ఆదేశించారు. వర్మి కంపోస్ట్ యూనిట్ ని పరిశీలించి యూనిట్ పరిమాణం పెంచాలని, నగరంలోని నగరపాలక సంస్థ పార్క్ ల్లో ఎరువుని వినియోగించడానికి సరిపడా సిద్దం చేయాలన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించి, నగరంలో గార్బేజ్ వల్నర్బుల్ పాయింట్స్ ఉండకుండా సచివాలయాల వారీగా కార్యదర్శులే భాధ్యత తీసుకోవాలన్నారు. నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ చేస్తే జీరో గార్బేజ్ వల్నర్బుల్ పాయింట్స్ సాధ్యమవుతుందన్నారు. పర్యటనలో ఎంహెచ్ఓ మధుసూదన్, వెహికిల్ షెడ్ డిఈఈ శ్రీధర్, ఎస్.ఎస్. ఆనంద కుమార్, ఏఈ రవి కిరణ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు రత్నం, ఏడు కొండలు, సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News