-ప్రస్తుతం ఎపిలోని రిజర్వాయర్లన్నీ జలకళను సంతరించుకున్నాయి
-గత ప్రభుత్వం ఐదేళ్ళలో సాగునీటి వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది
-కాలువగట్లు,ఏటిగట్ల పటిష్టతకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాం
-విధినిర్వహణలో అలసత్వం వహించిన కృష్ణా జిల్లా ఎస్ఇని ఇఎన్సికి సరెండర్
-పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరందించేందుకు చర్యలు చేపట్టాం
-రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు డా.ఎన్.రామానాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అందుబాటులో ఉండే ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ఈప్రభుత్వ ప్రధమ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖా మాత్యులు డా.నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.మంగళవారం రాష్ట్ర సచివాలయం లోని మంత్రివర్యుల చాంబరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం సాగునీటి వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని కాలువలు,డ్రైన్లలో పూడికతీత చేపట్టలేదని దానివల్ల నేడు నీటి ప్రవాహానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.నేడు రాష్ట్రంలోని జలశయాలన్నీ జలకళను సంతరించుకుని కళకళలాడుతున్నాయని అన్నారు.పొతిరెడ్డి పాడు నుండి నీటిని తీసుకుని శ్రీశైలం కుడి కాలువ,హంద్రీనీవా,కెసి కాలువల ద్వారా రాయలసీమ సాగు,తాగునీటి అవసరాలను తీర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.వరదనీరు వృధాగా సముద్రంలోనికి పోకుండా అన్ని రిజర్వాయర్లను పూర్తిగా నీటితో నింపాలని జలవనరుల శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి రామానాయుడు మీడియాకు వివరించారు.
ప్రకాశం బ్యారేజి నుండి కుడి,ఎడమ కాలువల ద్వారా కృష్ణా డెల్టాకు పూర్తిగా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి రామానాయుడు చెప్పారు.సాగునీటి ఎద్దడిని అధికమించేందుకు వీలుగా ఖరీఫ్ పంటను సాధ్యమైనంత ముందుగా వేసుకోవాలని రైతులకు విజ్ణప్తి చేశామని తెలిపారు.శ్రీశైలం,నాగార్జున సాగర్,పులిచింతల,పట్టిసీమ నుండి నీటిని తీసుకుని కృష్ణా డెల్టాకు పూర్తి స్థాయిలో నీటిని అందించడం జరుగుతోందని చెప్పారు. వ్యవసాయం,అభివృద్ధి సంక్షేమం ఈప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశాలుగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.
గత ప్రభుత్వం సాగునీటి వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసి కాలువలు,డ్రైన్లలో తట్టమట్టి కూడా పూడిక తీయకపోవడంతో నేడు సాగునీటి పారుదలకు అనేక ఇబ్బందులు ఎదురువు తున్నాయని మంత్రి రామానాయుడు చెప్పారు.అదే విధంగా లాకులు,షట్టర్లకు కనీసం గ్రీసు కూడా పూయక పోడవంతో అవన్నీ దెబ్బతిని పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయని అన్నారు. అదే విధంగా ఏటిగట్లు,కాలువగట్లు బలహీనమై గండ్లుపడే పరిస్థితులు నెలకొన్నాయని అలాంటివన్నీ గుర్తించి యుద్ద ప్రాతిపదికన మరమ్మత్తులు చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.జిల్లా కలక్టర్ నేతృత్వంలో రెవెన్యూ,పోలీస్,తాగునీటి సరఫరా,జలవనరుల శాఖ అధికారులతో బృందాలు ఏర్పాటు చేసి ఏటిగట్ల పటిష్టతకు చర్యలు తీసుకోవాలని చెప్పామన్నారు.ఎస్ఇ మొదలు ఎఇ వరకూ అధికారులు,సిబ్బంది అంతా దీనిలో చురుగ్గా పనిచేయలని ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి చెప్పారు. విధి నిర్వహణలో అలక్ష్యం వహించిన కృష్ణా జిల్లా ఎస్ఇ ప్రసాద్ బాబు ఇఎన్సికి సరెండర్.
ప్రకాశం బ్యారేజి నుండి కృష్ణా డెల్టాలోని కుడి,ఎడవ కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని అందించాలని ఆదేశించగా కృష్ణా జిల్లా ఎస్ఇ ప్రసాద్ బాబు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇఎన్సికి సరెండర్ చేసినట్టు జలవనరుల శాఖామాత్యులు డా.ఎన్.రామా నాయుడు చెప్పారు.గత 31న ఎస్ఇలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కృష్ణా డెల్టాకు కృష్ణానది పరివాహక ప్రాంతం,పట్టిసీమ,ప్రకాశం బ్యారేజిలో అందుబాటులో ఉన్ననీటిలో 16వేల 500 క్యూసెక్కుల నీటిని కుడి,ఎడమ కాలువల ద్వారా సాగునీటికి సరఫరా చేయాలని ఆదేశించామని తెలిపారు.అదే సమయంలో పులిచింతల నుండి నీటిని డ్రా చేసుకోవాలని చెప్పగా ఈనెల 1వతేదీన 14వేల క్యూసెక్కులు,2న 15వేలు,3న 12వేలు,4న 10వేలు, 5వతేదీన 11వేల క్యూసెక్కుల నీటిని కాలువల ద్వారా విడుదల చేశారని వివరించారు. సాగునీటి విడుదలలో ఎస్ఇ పూర్తిగా నిర్లక్ష్యం వహించారని గమనించి ఇఎన్సికి సరెండర్ చేసినట్టు స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News