Breaking News

అక్టోబరు 2న వికసిత్ ఎపి@2047 విజన్ డాక్యుమెంట్ ప్రారంభం

-ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన
-2047 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకా ఎపిని అభివృద్ధి చేయడమే లక్ష్యం
-ఈనెల 28న జరిగే మంత్రి మండలి ముందుకు ఈవిజన్ డాక్యుమెంట్
-సెప్టెంబరు 1 నుండి 15 వరకూ ప్రజల నుండి సూచనలు,అభిప్రాయాల సేకరణ
-సెప్టెంబరు 10-15 మధ్య మండల,మున్సిపల్,గ్రామస్థాయి అవగాహనా సదస్సులు
-వచ్చేనెల 10-14 మధ్య ఉన్నత పాఠశాలల విద్యార్ధిణీ విద్యార్ధులకు పోటీల నిర్వహణ
-సెప్టెంబరు 15-24 మధ్య ఎపి విజన్@2047 ముసాయిదా ఖరారు
-సెప్టెంబరు 25న వికసిత్ ఎపి విజన్@2047 తుది ముసాయిదా సమర్పణ
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబరు 2వ తేదీన వికసిత్ ఆంధ్రప్రదేశ్@2047-విజన్ డాక్యుమెంట్ ను లాంచనంగా ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు.వికసిత్ ఆంధ్రప్రదేశ్@2047 ప్రణాళిక రూప కల్పనపై మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు,ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు,శాఖాధిపతులతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్@2047 విజన్ డాక్యుమెంట్ రూప కల్పనకు చర్యలు చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు.ఏడాదికి 15శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా వికసిత్ ఎపి@2047 విజన్ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపారు.2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిద్దడంతో పాటు 45వేల డాలర్ల తలసరి ఆదాయంతో కూడిన 2ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈవిజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నట్టు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు.
ఈనెల 28న జరిగే రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ముందుకు ఈవికసిత్ ఎపి@2047ను విజన్ డాక్యుమెంట్ తీసుకురావడం జరుగుతుందని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు. దీనిపై సెప్టెంబరు 1 నుండి 15 వరకూ ప్రజల నుండి సూచనలు,సలహాలు,అభిప్రాయాల సేకరించడం జరుగుతుందని చెప్పారు.ఈనెల 21 నుండి 31 వరకూ సంబంధిత శాఖాధిపతులు జిల్లా అధికారులకు,క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన కల్పించాలని,ఈనెల 27న జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహిస్తామని అన్నారు.అదే విధంగా వచ్చేనెల 10-15 మధ్య మండల,మున్సిపల్,గ్రామ స్థాయి అవగాహనా సదస్సులను 10-14 మధ్య ఉన్నత పాఠశాలల విద్యార్ధిణీ విద్యార్ధులకు ఈఅంశంపై వివిధ పోటీల నిర్వహించి 15వతేదీన విజేతలకు బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు.సెప్టెంబరు 15-24 మధ్య ఎపి విజన్@2047 ముసాయిదా ఖరారు చేసి సెప్టెంబరు 25న వికసిత్ ఎపి విజన్@ 2047 తుది ముసాయిదాను సిద్దం చేసి 29న ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాలను తీసుకున్న తదుపరి నీతి ఆయోగ్ సమన్వయంతో అక్టోబరు 2వ తేదీన వికసిత్ ఎపి@2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రధాన మంత్రి,ముఖ్యమంత్రి చేతుల మీదగా లాంచనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు.
వికసిత్ ఎపి@2047లో భాగంగా ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రతి జిల్లాకు 5యేళ్ళ విజన్ కార్యాచరణ ప్రణాళికలను సిద్దం చేయడం జరుగుతుందని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు.జిల్లాల విజన్ కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనలో భాగంగా జీరో పేదరికం,సామాజిక,భౌతిక మౌలిక సదుపాయాల అభివృద్ధి,జనాభా నిర్వహణ(Demographic Management),సులభతర జీవన విధానం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని రూపొందిచడం జరుగుతుందని చెప్పారు.అదే విధంగా శాఖల వారీగా ప్రణాళికలు తయారు చేయాల్సి ఉంటుందని తెలిపారు.వికసిత్ ఎపి@2047 పై ప్రజల నుండి అభిప్రాయాలు, స్పందనను సేకరించేందుకు,కీ పెర్పార్మెన్స్ ఇండికేటర్ల ద్వారా దీనిని మానిటర్ చేసేందుకు క్యూఆర్ కోడ్ ను అందుబాటులో ఉంచనున్నామని దీనిపై వివిధ సామాజిక ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు.అదే విధంగా ఈక్యూఆర్ కోడ్ ను గ్రామ,వార్డు సచివాలయాలు,చౌకధరల దుకాణాలు తదితర ప్రజలు ఎక్కవగా సందర్శించే ప్రాంతాలన్ని చోట్ల డిస్ ప్లే చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.ముఖ్యంగా మొబైల్ అప్లికేషన్ వాట్సప్ ద్వారా అందుబాటులో ఉంచాలని చెప్పారు.అంతేగాక వివిధ మొబైల్ నెట్ వర్కులు ద్వారా ఈక్యూర్ కోడ్ ను ప్రజలందరికీ చేరవేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.
ఈసమావేశంలో రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వికసిత్ ఎపి@2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.ఇందుకు సంబంధించి ఈనెల 23న రివైజ్డ్ ముసాయిదాను సిద్ధం చేయడం జరుగుతుందన్నారు.
ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్,ఐటి కార్యదర్శి సౌరవ్ గౌర్,విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్,గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ హరి నారాయణ,ఐఅండ్పిఆర్ డైరెక్టర్ హిమాన్సు శుక్లా, ప్రణాళికాశాఖ జెఎస్ అనంత శంకర్,శివప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు. అలాగే వర్చువల్ గా వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు,కార్యదర్శులు,శాఖాధిపతులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *