-ఇసుక బుకింగ్ లో సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు
-రాష్ట్రస్థాయి టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4599
-కృష్ణాజిల్లా టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-6026
-రేపటినుండి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
-మీడియా సమావేశంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త ఇసుక విధానం అమలు చేయనున్నదని, ఈలోగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రస్తుత ఉచిత ఇసుక విధానాన్ని అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. ఉచిత ఇసుక విధానం నూతన మార్గదర్శకాలపై ఇంచార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు తో కలిసి గురువారం కలెక్టరేట్లో మీకోసం సమావేశపు హాలులో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో పర్యావరణ మార్గదర్శకాలు ఎన్ జి టి ఆదేశాల ప్రకారం ఇసుక రీచ్ లు పనిచేయడం లేదని, కావున ఇసుక స్టాక్ లేదని అన్నారు. అయితే కృష్ణజిల్లా వాసులకు సమీపంలో ఎన్టీఆర్ జిల్లా పరిధిలో గల నాలుగు ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక బుకింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, ఈ కేంద్రాల వద్ద నుండి జిల్లా వాసులు ఇసుక పొందవచ్చని తెలిపారు. వాటి వివరాలు..
-కీసర స్టాక్ పాయింట్- కంచికచర్ల-3 గ్రామ సచివాలయంలోనూ,
-కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామ సచివాలయంలోనూ,
-జగ్గయ్యపేట మండలం షేర్మొహమ్మద్పేట పంచాయతీ కార్యాలయంలో,
-పోలంపల్లి స్టాక్ పాయింట్- (వత్సవాయి మండలం)కు పోలంపల్లి గ్రామ సచివాలయంలోనూ ఏర్పాటు చేసిన ఇసుక బుకింగ్ కేంద్రాల వద్ద జిల్లా వాసులు ఇసుక బుకింగ్ చేసుకోవచ్చని ఇంచార్జ్ కలెక్టర్ తెలిపారు.
బుకింగ్ సమయంలోనే స్లాట్ కేటాయించడం జరుగుతుందన్నారు. జిల్లాస్థాయి ఇసుక కమిటీ (డీఎల్ఎస్సీ) నిర్ధారించిన రవాణా ఛార్జీలను మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. ఈ సమాచారం ఎన్టీఆర్ జిల్లా, కృష్ణాజిల్లా వెబ్సైట్లో పెడుతున్నట్లు తెలిపారు. రవాణా చార్జీలు అధికంగా వసూలు చేసినా, ఇతరత్రా ఏవైనా ఫిర్యాదులు చేయాల్సి వస్తే 1800-599-4599 (రాష్ట్ర స్థాయిలో) 1800-425-6026 (కృష్ణాజిల్లా) టోల్ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. రేపటినుండి కృష్ణాజిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇంచార్జ్ కలెక్టర్ తెలిపారు.
జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానం పటిష్ట అమలుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా జరిపినా, నిల్వ ఉంచినా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో, మీడియా సహకారంతో ఉచిత ఇసుక విధానాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్నట్లు తెలిపారు. జిల్లా గనుల శాఖ అధికారి కొండారెడ్డి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News