-సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భముగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చుతూ వాటి ప్రయోజనాలను ప్రజలకు అందించి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకోవడం జరుగుతోందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. సోమవారం స్థానిక 6,31,32,33,30 డివిజన్లకు సంబంధించి అజాద్ చౌక్ జంక్షన్ వద్ద స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఏర్పాటుచేసిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ చివర లబ్ధిదారుని వరకు చేరుకునే విధంగా చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. అందుకు నిదర్శనం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఈ వంద రోజులు పాలన దానికి ఉదాహరణ అన్నారు. ఒకవైపు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, మరోవైపు అన్న క్యాంటీన్లు, గత ప్రభుత్వం రైతు వద్ద కొన్న ధాన్యానికి బకాయిలను చెల్లించకపోతే, నేడు ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందని స్పష్టం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ పౌరులు కీలక పాత్ర పోషించడం జరిగిందన్నారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు అనే సత్ సంకల్పం తో కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన బకాయిలన్నింటిని కూటమి ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. మన ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకే ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాల ద్వారా ప్రజా వేదికలను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో కూడా మీ సహాయ సహకారాలు, మీ అభిమానం ఇదే విధంగా కొనసాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.