విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పంపిణీదారుల పట్ల విప్రో కంపెనీ వైఖరి సరికాదని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్సూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సి.ఎస్.ప్రసాద్, అఖిల భారత పంపిణీదారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్. కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ వినియోగ ద్రవ్యం పంపిణీదారుల సంఘం, అఖిలభారత పంపిణిదారుల సంఘం సంయుక్తంగా గాంధీనగర్లోని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక మంది పంపిణీదారులు అనేక సంవత్సరాలుగా విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైటింగ్స్ లిమిటెడ్ కంపెనీకి సేవలందిస్తున్నారన్నారు. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి పంపిణీ వర్గం కంపెనీ అభివృద్ధికై కృషి చేసిందని అయితే ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ కంపెనీతో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారన్నారు. పలు ఆంక్షలు విధిస్తూ వారి విధి విధానాలను తరచూ మారుస్తూ పంపిణీదారులు ఇబ్బంది పడేలా చేస్తున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే నాన్ సపోర్ట్ ఉద్యమాన్ని చేపట్టడం, కొనుగోలు ఆపడం వంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆర్. సత్యనారాయణ, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News