– నవంబర్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
– జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ అధికారి జి.ఉమాదేవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విధానంలో 22 ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థులు నవంబర్ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికారత అధికారి జి.ఉమాదేవి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐసీపీఎస్ (డీసీపీయూ) యూనిట్లో ఒక అకౌంటెంట్, ఒక డేటా అనలిస్ట్; ఎస్ఏఏ యూనిట్లో ఒక మేనేజర్/కోఆర్డినేటర్, ఒక ఏఎన్ఎం (నర్స్), ఒక పార్ట్టైం డాక్టర్, ఒక చౌకీదార్ (వాచ్ ఉమెన్), నాలుగు ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. చిల్డ్రన్ హోమ్స్లో ఒక స్టోర్కీపర్ కమ్ అకౌంటెంట్, ఒక ఎడ్యుకేటర్ (పార్ట్టైమ్), రెండు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మ్యూజిక్ టీచర్ (పార్ట్టైమ్), రెండు పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ (పార్ట్టైమ్), ఒక కుక్ (అవుట్ సోర్సింగ్), రెండు హెల్పర్ (అవుట్ సోర్సింగ్), రెండు హౌస్ కీపర్, ఒక ఉమెన్ హెల్పర్ కమ్ నైట్ వాచ్ఉమెన్ ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్లు వివరించారు. స్థానిక అర్హులైన 18-42 ఏళ్ల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుందన్నారు. ntr.ap.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని, గజిటెడ్ ఆఫీసర్ అటెస్టెడ్ ధ్రువపత్రాల నకళ్లను జతచేసి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, డోర్ నెం. 6-93, కార్మెల్ చర్చి ఎదురురోడ్, కానూరు, విజయవాడకు స్వయంగా సమర్పించాలని జి.ఉమాదేవి సూచించారు.
Prajavartha Online Telugu News