– జయంతి సందర్భంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఘనంగా నివాళులర్పించారు.
శనివారం ఉదయం జిల్లా కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ కలిసి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య సమరంలో ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగనిరతి భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం దేశ ప్రజలకు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
మహనీయుల ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, యువత అల్లూరి సీతారామరాజు జీవితం నుంచి స్ఫూర్తి పొంది దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. వాయు కాలుష్యాన్ని తగ్గించి, స్వచ్ఛ మైన గాలి కోసం కృషి చేసే కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సైకిల్ పై ప్రయాణించి కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో ఇంచార్జ్ డిఆర్ఓ పి పోతురాజు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఫణి ధూర్జటి, కలెక్టరేట్ ఏఓ రాధిక, సూపరింటెండెంట్ నెల్సన్ పాల్, కలెక్టరేట్ తహసిల్దార్ హరనాథ్, డిప్యూటీ తాసిల్దార్ నారాయణ, సుభాష్ తదితర కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొని అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించారు.
Prajavartha Online Telugu News