అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవం–2026 ప్రత్యేక ముందస్తు వేడుకలను ఈ నెల 5వ తేదీ (బుధవారం) సాయంత్రం 4.00 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు విజయవాడ చేనేత సేవా కేంద్రం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చారిత్రాత్మకమైన 1905 స్వదేశీ ఉద్యమం స్ఫూర్తిని స్మరించుకుంటూ, భారతీయ చేనేత వారసత్వ పరిరక్షణలో చేనేత కళాకారులు అందిస్తున్న విశిష్ట సేవలను గౌరవించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన “జాతీయ చేనేత దినోత్సవం” నిర్వహించబడుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా 12వ జాతీయ చేనేత దినోత్సవం–2026 వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేసిందన్నారు. జాతీయ స్థాయి ప్రధాన కార్యక్రమం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో నిర్వహించబడనుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఈ నెల 5వ తేదీ అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో సీనియర్ చేనేత కళాకారులచే ప్రత్యక్ష నేత ప్రదర్శనలు, జి.ఐ. (GI) గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ చేనేత ఉత్పత్తుల ప్రత్యేక ప్రదర్శన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేనేత సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు, చేనేత కళాకారులు–ఫ్యాషన్ డిజైనర్లు–ఎన్ఐడీ విద్యార్థుల మధ్య ఇంటరాక్టివ్ సెషన్, అలాగే హ్యాండ్లూమ్ ఫ్యాషన్ షో మరియు సారీ డ్రేపింగ్ పోటీలు నిర్వహించబడనున్నాయని తెలిపారు.
అదేవిధంగా, 2026 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడ చేనేత సేవా కేంద్రం పరిధిలోని చీరాల (బాపట్ల జిల్లా – ప్రధాన కేంద్రం), పోలవరం (కృష్ణా జిల్లా), అంగర (తూర్పు గోదావరి జిల్లా), సి.కె. దిన్నె (వైఎస్ఆర్ కడప జిల్లా), తాడిపత్రి (అనంతపురం జిల్లా) చేనేత క్లస్టర్లలో ఏకకాలంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సన్మానం, చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు, వినియోగదారుల చైతన్య కార్యక్రమాలు నిర్వహించబడనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News