– ఈ-వేదికలను సద్వినియోగం చేసుకోండి
– జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ను చేరుకోవాలంటే ఆన్లైన్ మార్కెటింగ్పై అవగాహన పెంపొందించుకోవడం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లి రైజ్ కేంద్రంలో శనివారం జరిగిన హస్తకళా ఉత్పత్తుల తయారీ వర్క్షాప్తో పాటు ఆన్లైన్ మార్కెటింగ్పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ హాజరై శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించి.. స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, చిన్న వ్యాపారులు, చేతివృత్తిదారులు ఈ-కామర్స్ వేదికలను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా తమ ఉత్పత్తులను స్థానిక మార్కెట్కే పరిమితం కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలో విక్రయించే అవకాశం కలుగుతుందన్నారు. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రచారం, ఆన్లైన్ చెల్లింపులు, ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ల వినియోగంపై అవగాహన పెంచుకోవడం ద్వారా వ్యాపార అవకాశాలు మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు. ఉత్పత్తుల నాణ్యత, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, సరైన బ్రాండింగ్తో పాటు ఆన్లైన్ ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావుతో పాటు స్టెల్లా కాలేజ్ అధ్యాపకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News