గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో వేగవంతం చేయాలని, బిఎల్ఓల వారీగా ప్రతి రోజు సాయంత్రానికి రిపోర్ట్ ఇవ్వాలని తూర్పు నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్వో), నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బిఎల్ఓలు, సూపర్వైజరీ అధికారులను ఆదేశించారు. సోమవారం శ్రీనగర్, రైల్ పేట ప్రాంతాల్లోని పలు పోలింగ్ బూత్ల పరిధిలో ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ, ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జులై 14తో ఎన్యూమరేషన్ దశ ముగియనున్న నేపథ్యంలో ఓటర్లు చివరి వరకు వేచి ఉండకుండా తమ ఎన్యూమరేషన్ ఫారాలను త్వరితగతిన సమర్పించాలని సూచించారు. అందిన ఫారాలను ఎప్పటికప్పుడు డిజిటలైజ్డ్, మ్యాపింగ్ కూడా చేయాలన్నారు. ఫారాలు అందకపోయినా, సమర్పించడంలో ఇబ్బందులు ఉన్నా లేదా ఏవైనా సందేహాలు ఉన్నా సంబంధిత బీఎల్వోను వెంటనే సంప్రదించాలని, లేకుంటే ఈ నెల 21 ప్రచురించే ముసాయిదా ఓటర్ల లిస్టు లో ఓటు ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే బిఎల్ఓలకు క్షేత్ర స్థాయిలో తోడ్పాటుని ఇచ్చేలా సహకారం కోసం వివిధ శాఖల సిబ్బందిని కేటాయించడం జరిగిందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు విధులు కేటాయించిబడిన యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలోనే ఉండాలని, అత్యల్ప పురోగతి నమోదైన పోలింగ్ బూత్లపై సూపర్వైజరీ అధికారులు, ఏఈఆర్ఓలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఏలు కూడా బీఎల్వోలతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో సూపర్వైజర్లు హనీఫ్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News