-ప్రత్యేక ప్రచారం – గోడ ప్రతులు ఆవిష్కరణ
-ఇంచార్జి కలెక్టర్ మేఘా స్వరూప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పశువుల ఆరోగ్య పరిరక్షణ, ఉత్పాదకత పెంపు, వ్యాధుల నివారణ లక్ష్యంగా జనవరి 19 నుండి 31, 2026 వరకు జిల్లాలోని పశుపాలక రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లు తూర్పు గోదావరి ఇంచార్జి జిల్లా కలెక్టర్(ఎఫ్ ఎ సి) / జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన “పశు ఆరోగ్య శిబిరాలు” ప్రత్యేక ప్రచార గోడ పత్రికలను శనివారం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మేఘా స్వరూప్ మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో గ్రామస్థాయిలో పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పశుపాలక రైతుల పశువులు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
ఈ శిబిరాల్లో పాలిచ్చే పశువులు, దూడలు, గొర్రెలు, మేకలకు డీవార్మింగ్ (పురుగుమందుల పంపిణీ), గొర్రెల మశూచి టీకాలు, కోళ్లకు మరియు బాతులకు టీకాలు వేయడం, అలాగే ఉచిత పశు వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగుపడి రైతులకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని ఇంచార్జి కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా. టి. శ్రీనివాస రావు మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో ఉదయం 8.00 గంటల నుండి పశు ఆరోగ్య శిబిరాలు ప్రారంభమవుతాయని తెలిపారు. పశుపాలక రైతులు తమ పశువులను శిబిరాలకు తీసుకొచ్చి ఉచిత పశు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఓ ఎల్. అప్పలకొండ, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డా. టి. శ్రీనివాస రావు, ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డా. కె. సత్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News