-నిడదవోలు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు
-బాలికా సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి దుర్గేష్ పిలుపు
-లింగ వివక్షను రూపుమాపి, ఆడపిల్లలను అద్భుత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచన
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో బాలికల సంరక్షణ, వారి చదువు, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. శనివారం నిడదవోలులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘జాతీయ బాలికా దినోత్సవ’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. బాల బాలికల విషయంలో సమాజ దృక్పథంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఆడపిల్లలను కాపాడుకోవడమే కాకుండా, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు, గురువులు మరియు సమాజంపై ఉందన్నారు. ఆడపిల్లలను అక్రమ రవాణా (చైల్డ్ ట్రాఫికింగ్), లైంగిక వేధింపుల నుండి కాపాడాల్సిన అవసరం ఉందని వివరించారు. వారి హక్కుల పరిరక్షణలో తల్లిదండ్రులు, అధికారులు, రాజకీయ నాయకులు అందరూ భాగస్వాములే అని పేర్కొన్నారు.భ్రూణ హత్యలు అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోందని, లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని ఈ క్రమంలో స్కానింగ్ సెంటర్లపై ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతుందన్నారు. ఒకప్పుడు జనాభా నియంత్రణ గురించి మాట్లాడామని, కానీ నేడు దేశాభివృద్ధికి మానవ వనరుల అవసరం దృష్ట్యా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు లు జనాభా వృద్ధికి పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఆడపిల్లల సంరక్షణ కోసం ఐసీడీఎస్, వైద్య శాఖ, ఉపాధి కల్పన సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వివక్షను పోగొట్టి, బాలికలకు సమాన అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.సరైన అవకాశాలు కల్పిస్తే మహిళలు అన్ని రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తారని, నేటి విద్యార్థినులు కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు.బాలికలను సురక్షిత వాతావరణంలో పెంచుతామని, వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తామని ఈ సందర్భంగా అందరూ ప్రతిజ్ఞ చేయాలని మంత్రి దుర్గేష్ కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, విద్యార్థినులు, ఐసీడీఎస్ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News