Breaking News

చెత్తరహిత పట్టణంగా నిడదవోలును తీర్చిదిద్దుదాం

-నిడదవోలులో ఘనంగా నిర్వహించిన’స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు
-పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, శానిటేషన్ కోట్లు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్
-బుర్రకథ ద్వారా ప్రజల్లో అవగాహన.. మానవహారం, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసిన మంత్రి దుర్గేష్
-పరిశుభ్రత మన జీవన విధానంలో భాగం కావాలని మంత్రి కందుల దుర్గేష్ సూచన

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
పరిశుభ్రత అనేది కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా, ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర సంకల్పంలో భాగంగా శనివారం నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ వద్ద నిర్వహించిన ‘స్వచ్ఛాంధ్ర – స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా, పురపాలక సంఘం ఛైర్మన్ భూపతి ఆదినారాయణ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్యాన్ని కాపాడటంలో నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది సేవలను కొనియాడారు. వారిని ఘనంగా సన్మానించి, శానిటేషన్ కోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పిల్లలకు చిన్నతనం నుంచే పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని, అప్పుడే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల వద్దే తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని తద్వారా నిడదవోలును చెత్తరహిత పట్టణంగా, ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్ఛమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బంది కోసం ఎదురుచూడకుండా, తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తుచేశారు. రోడ్లపై చెత్త వేయడం మానుకోవాలని హితవు పలికారు. వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా ‘జీరో వేస్ట్’ గ్రామాలను, పట్టణాలను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.ప్రజల భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుందన్నారు. ఈ సందర్భంగా వేదికపై కళాకారులు ప్రదర్శించిన బుర్రకథ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. బుర్రకథ ద్వారా స్వచ్ఛతపై చక్కని అవగాహన కల్పించిన కళాకారులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం అందరితో కలిసి మానవహారం నిర్వహించి, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, కమిషనర్ కృష్ణవేణి, కౌన్సిలర్లు, కూటమి నాయకులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *