– జీరో డిఫెక్ట్ – జీరో ఎఫెక్ట్ సర్టిఫికేషన్తో బహుళ ప్రయోజనాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఆటోనగర్లోని ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ అసోసియేషన్ హాల్లో గురువారం ర్యాంప్ (రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్) కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాస్థాయి జెడ్ఈడీ (జీరో డిఫెక్ట్ – జీరో ఎఫెక్ట్) సర్టిఫికేషన్పై అవగాహన కార్యక్రమం జరిగింది. స్కిల్ ఎక్స్ప్రెస్ ఏజెన్సీ సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అంకిత పాండే, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో ఎం.విశ్వ, ప్రపంచ బ్యాంకు ప్రతినిధి ఆదర్శ్ కుమార్, హర్ష్ జంజారియా, మిలన్ శర్మ తదితరులు హాజరైన ఈ కార్యక్రమంలో ఉత్పత్తుల్లో లోపాలు లేకుండా నాణ్యతను పెంచడం (జీరో డిఫెక్ట్), పర్యావరణంపై దుష్ప్రభావం చూపని విధంగా తయారీ విధానాలను అవలంబించడం (జీరో ఎఫెక్ట్)పై వివరించారు. జెడ్ఈడీ సర్టిఫికేషన్ పొందే విధానం, ఇందుకు లభించే ప్రభుత్వ ఆర్థిక రాయితీలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియపై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. జిల్లాలోని తయారీ యూనిట్లు జెడ్ఈడీ సర్టిఫికేషన్ ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందిపుచ్చుకొని, ఉన్నతంగా ఎదగాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎం.మధు కోరారు. కార్యక్రమంలో వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్థానిక పారిశ్రామికవేత్తలతో ముచ్చటించి, తయారీ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు.
కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.సుధాకర్, శ్రీనివాసులురెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం నుంచి ఎస్.బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News