– సమతుల ఎరువుల వినియోగంపై దృష్టిపెట్టాలి
– రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలి
– ధర్తీ మాత బచావో అభియాన్ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి సాగుతో నేలతల్లి ఆరోగ్యం బాగుంటుందని.. ఈ సాగు విధానాలతో పాటు సమతుల ఎరువుల వినియోగంపై రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో ధర్తి మాత బచావో అభియాన్ (భూ మాత పరిరక్షణ కమిటీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి ఉద్దేశించిన కార్యక్రమాన్ని పటిష్టంగా అమలుచేయాల్సిన అవసరముంందన్నారు. పంటలకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందిస్తూ, సాగు ఖర్చులను తగ్గించడం, నేల సారాన్ని పెంచడం వంటివాటిపై ప్రధానంగా దృష్టిపెట్టాలన్నారు. రైతులు రసాయన ఎరువులతో పాటు జీవ ఎరువులను సమతులంగా వినియోగించడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవచ్చన్నారు. ముఖ్యంగా నానో యూరియా, నానో డీఏపీ వంటి ఆధునిక ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. ఎరువుల తయారీ సంస్థలు, శాస్త్రవేత్తలు కలిసి రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామస్థాయిలో మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఎరువుల సరఫరా, వినియోగంపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని పేర్కొంటూ పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని సూచించారు. జిల్లాకు కేటాయించిన ఎరువులు ఇతర ప్రాంతాలకు మళ్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో ఎరువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అధికంగా యూరియా వినియోగం జరుగుతున్న 100 గ్రామాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు.
సమావేశంలో
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సరిత, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయ కుమారి, జిల్లా సహకార అధికారి అనిత, ఏపీసీఎన్ఎఫ్ డీపీఎం, కృషి విజ్ఞాన కేంద్రం గరికపాడు శాస్త్రవేత్త డా. శివ ప్రసాద్, పరిశ్రమల శాఖ ఐపీఓ రవి, ఆర్సీఎఫ్, సీఐఎల్ సంస్థల ప్రతినిధులు పునీత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News