రెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు తాము పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలలో విక్రయించి మద్దతు ధరను పొందాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అన్నారు. రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామంలోని రైతులను వారి ధాన్యం కళ్లాల వద్ద కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు పండించిన ధాన్యానికి మద్దత్తు ధర అందించేందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దళారీల బారిన పడకుండా తాము పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలలో అందించి కనీస మద్దత్తు ధరను పొందాలన్నారు. ప్రతీ రైతు తమ వివరాలను ఈ-పంటలో నమోదు చేసుకోవాలని, తమకు దగ్గరలోని వ్యవసాయ శాఖ సిబ్బంది ని కలిసి తమ పొలం విస్తీర్ణం, వేసిన పంట, తదితర వివరాలను తెలియజేసి వెంటనే ఈ-పంటలో నమోదు చేసుకోవాలన్నారు. గోనెసంచుల కూడా రైతు భరోసా కేంద్రం వద్ద సిద్ధంగా ఉన్నాయన్నారు. ధాన్యం అమ్మకంలో రైతులు సమస్యలు ఎదుర్కొంటుంటే దగ్గరలోని రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాలని, వాటిని పరిష్కరించేందుకు సంబంధిత సిబ్బంది చర్యలు తీసుకుంటారన్నారు.
Prajavartha Online Telugu News